
Hero Electric-Mahindra: మహీంద్రా ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్ బైక్ల తయారీ
దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), మహీంద్రా గ్రూప్ (Mahindra Group).. విద్యుత్తు వాహనాల (EV) తయారీ కోసం చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకొన్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్ తయారీ కేంద్రంలో హీరో ఎలక్ట్రిక్ బైక్లు తయారు కానున్నాయి. మధ్యప్రదేశ్లోని పీథంపూర్లో ఉన్న మహీంద్రా ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్కు చెందిన ఆప్టిమా, ఎన్వైఎక్స్ బైక్లు తయారు కానున్నాయి. మార్కెట్లో ఈవీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరు సంస్థలు ప్రకటించాయి.
దీంతో 2022 పూర్తయ్యే నాటికి ఏటా 1 మిలియన్ విద్యుత్తు వాహనాల తయారీ సామర్థ్యాన్ని అందుకోవాలన్న తమ లక్ష్యం నెరవేరనుందని హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. లుథియానాలోని తమ తయారీ కేంద్రం సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు వెల్లడించింది.