
India-Dubai: టికెట్ల బుకింగ్స్ మొదలు
ఇంటర్నెట్డెస్క్: జులై 15వ తేదీ నుంచి భారత్-దుబాయ్ మధ్య ప్రయాణాలు మొదలు కానున్నాయి. కరోనా సెకండ్వేవ్ తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్ 24వ తేదీ నుంచి భారత్ నుంచి దుబాయ్ రావడంపై నిషేధం విధించారు. ఆ తర్వాత నుంచి ఈ నిషేధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఈ వారం నుంచి దుబాయ్కు ఫ్లైట్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ సంస్థకు సంబంధించి ఎకానమీ క్లాస్, ఫస్ట్క్లాస్ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక ఇండిగో సంస్థ బుకింగ్స్ స్వీకరణను ప్రారంభించింది.
ఎమిరేట్స్ బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.1.05 లక్షలు ఉండగా.. ఎకానమీ క్లాస్ రూ.58,507గా ఉంది. విస్టారాలో 9పీఎం ఫ్లైట్కు రూ.45 వేలు, 7.30 పీఎం ఫ్లైట్కు రూ.80వేలుగా ఉంది. ఎకానమీ క్లాస్ ధర రూ.23,077గా ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఫ్లైదుబాయ్,ఇండిగో, స్పైస్జెట్, ఖతార్ ఎయిర్వేస్, లుఫ్తాన్సాలు సర్వీసులు నడపనున్నాయి. టికెట్ ధరలు కంపెనీ, క్లాస్ను బట్టి రూ.10,902 నుంచి అత్యధికంగా రూ.3.9 లక్షల వరకు ఉన్నాయి.
త్వరలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ గత నెల వెల్లడించింది. ‘‘దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత దేశాలకు చెందిన ప్రయాణికులకు విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా భారత దేశ ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతో పాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే ఎమిరేట్స్లో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణానికి బయలుదేరే ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది’’ అని ఎమిరేట్స్ నాటి ప్రకటనలో పేర్కొంది. గతంలో ఇరు దేశాల మధ్య వారానికి సుమారు మూడు వందల సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు ఆసంస్థ వెల్లడించింది.