కొవిడ్‌ సంక్షోభం నుంచి భారత్‌ త్వరగా బయటకొస్తుంది

ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న కొవిడ్‌-19 సంక్షోభం నుంచి భారత్‌ దిగ్విజయంగా బయటపడుతుందని డెలాయిట్‌ సీఈఓ...

Published : 13 Apr 2021 01:32 IST

డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌

వాషింగ్టన్‌: ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న కొవిడ్‌-19 సంక్షోభం నుంచి భారత్‌ దిగ్విజయంగా బయటపడుతుందని డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌ అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దం భారత్‌దేనని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విసురుతున్న సవాళ్లను భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని తెలిపారు. ఈయన భారతీయ మూలాలున్న అమెరికా వ్యాపార నాయకుడు. ‘నా వారసత్వం (భారతీయుడు) అక్కడిదే కావడంతో నేను కొంత పక్షపాతంతో ఉన్నాను. కానీ భారత్‌లో ఉన్న ప్రతిభ కారణంగా ఈ శతాబ్దం భారత్‌దేనని నిజంగా నమ్ముతున్నాను. దేశీయులందరికీ కొవిడ్‌ మహమ్మారి ప్రభావితం చేస్తున్నా, విజయవంతంగా ఎదుర్కొంటున్నారని, ఈ ఏడాది 12.5 శాతం వృద్ధిరేటును దేశం సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా ప్రకటించింద’ని రంజన్‌ గుర్తు చేశారు. మూలాలు పటిష్ఠంగా ఉండటమే భారత్‌ ఘనతగా వివరించారు. రోహ్‌టక్‌లో జన్మించిన ఈ భారతీయ-అమెరికా సీఈఓ 2015 నుంచి డెలాయిట్‌ సీఈఓగా పని చేస్తున్నారు.

సంక్షిప్తంగా

మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంక్‌ రుణాలు 5.56 శాతం పెరిగి రూ.109.51 లక్షల కోట్లకు; డిపాజిట్లు 11.4 శాతం వృద్ధితో రూ.151.13 లక్షల కోట్లకు చేరాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి.
కొన్నేళ్ల క్రితం జరిగిన ఏటీ-1 బాండ్ల అమ్మకం కేసులో యెస్‌ బ్యాంక్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది.
ఒక్కో షేరుకు రూ.20 మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌, చెన్నైలలో కార్యాలయ భవనాలు అభివృద్ధి చేసేందుకు కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డుతో స్థిరాస్తి సంస్థ ఆర్‌ఎంజడ్‌ కార్ప్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంయుక్త సంస్థలో కెనడా సంస్థ రూ.1500 కోట్లు (210 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని