ల‌క్ష్యం లేకుండా పెట్టుడి చేస్తే లాభం లేదు

ప్ర‌తి లక్ష్యం కోసం ఒక‌టి లేదా రెండు స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్టాలి. అప్పుడు త‌గిన రాబ‌డిని ఆశించవ‌చ్చు......

Updated : 01 Jan 2021 17:19 IST

ప్ర‌తి లక్ష్యం కోసం ఒక‌టి లేదా రెండు స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్టాలి. అప్పుడు త‌గిన రాబ‌డిని ఆశించవ‌చ్చు.మీ పెట్టుబ‌డులు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు ఉండాలి. అయితే ప‌న్ను ఆదా ఒక‌టే ముఖ్య ఉద్దేశంగా కాకుండా రాబ‌డి వ‌చ్చే వాటిలో పెట్టుబ‌డి పెట్టాలి.ఎంత ఆదాయం పొందారు. ఇక మీద‌ట ఎంత వ‌స్తుంది. పెట్టుబ‌డుల‌కు ఎంత కేటాయించాల‌న్న విష‌యం గురించి ఆలోచించాలి. లిక్విడిటీ, రాబ‌డి, లాక్‌-ఇన్ పీరియ‌డ్, ప‌న్ను మిన‌హాయింపులు వంటివి అన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబ‌డులను పెట్టాలి. పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, ఇంటి కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి ల‌క్ష్యాల కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలి.

ప్ర‌తి లక్ష్యం కోసం రెండు లేదా మూడు స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్టాలి. అప్పుడు ఒక‌దానిలో లాభం త‌క్కువైనా మ‌రో దానిలో లాభ‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెడితే ఎక్కువ కాలం వేచిచూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అనుకున్నంత రాబ‌డి పొంద‌క‌పోవ‌చ్చు.

అమ్మాయి కోసం అయితే సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌, పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెట్టాలి. మార్కెట్ల‌లో ఒడుదొడుకులు ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ నుంచి డెట్ ఫండ్ల‌కు, డెట్ నుంచి లిక్విడ్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు మార్చుకోవ‌చ్చు. అయితే దీనివ‌ల‌న అస‌లు మొత్తం త‌గ్గే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం కేవ‌లం ఈపీఎఫ్‌ మీద ఆధార‌డ‌కుండా ఎన్‌పీఎస్‌లో కూడా పెట్టుబ‌డులు పెట్టాలి. ఎన్‌పీఎస్‌లో కూడా ఈక్విటీల‌కు ఎక్కువ‌గా కేటాయించాలి. దీంతో దీర్ఘ‌కాలానికి ఎక్కువ రాబ‌డి పొంద‌వ‌చ్చు.
ఈపీఎఫ్ రేట్ల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యింస్తుంది. అవి వార్షికంగా 8 శాతం వ‌ర‌కు ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలు, ప్ర‌భుత్వ‌, కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంటుంది. మొత్తం క‌లిపి 10 శాతం రాబ‌డిని అంచ‌నా వేయ‌వ‌చ్చు. అయితే ఈపీఎఫ్ నుంచి పిల్ల‌ల పెళ్లి, అత్య‌వ‌స‌ర చికిత్స, గృహ నిర్మాణం కోసం పాక్షికంగా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అలా తీసుకుంటే ఈపీఎఫ్ మొత్తం త‌గ్గుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నం కోసం అది స‌రిపోక‌పోవ‌చ్చు.

ప‌దేళ్ల త‌ర్వాత మీరు ఇళ్లు కొనుగోలు చేయాల‌నుకుంటే డౌన్‌పేమెంట్ ఇంటి విలువ‌లో 15-20 శాతం ఉంటుంది. మిగ‌తాది గృహ రుణం పొంద‌వ‌చ్చు. దీనికోసం మీరు రెండు స్కీముల్లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. భ‌ద్ర‌త‌, వృద్ధి ,లిక్విడిటీ క‌లిగిన ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి. ఎందుకంటే ప‌దేళ్ల త‌ర్వాత మీరు ఇళ్లు ఎక్క‌డ కొనుగోలు చేస్తారో, ఎంత ధ‌ర ఉంటుందో తెలియ‌దు కాబ‌ట్టి ఇప్పుడే పెట్టుబ‌డులు ప్రారంభించాలి. దీనికోసం పీపీఎఫ్‌, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు.

స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాలు అంటే ఒక అయిదు సంవ‌త్స‌రాల్లో డ‌బ్బు కావాల‌నుకుంటే రిక‌రింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎంచుకోవ‌చ్చు. స్వ‌ల్ప కాలం పెట్టుబ‌డుల కోసం పీపీఎప్, ఈక్విటీలు సూచించ‌ద‌గిన‌వి కావు.

చివ‌ర‌గా
పెట్టుబ‌డులు కేవ‌లం ప‌న్ను ఆదా కోసం చేయ‌కూడ‌దు. ప్ర‌తి ప‌థ‌కానికి కొన్ని అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు ఉంటాయి. మీ స్నేహితులు లేదా బందువులు పెట్టార‌ని వారు చెప్పిన దానిలో పెట్టుబ‌డులు చేయ‌కూడ‌దు. మీ లక్ష్యాల‌కు ఏది అనుగుణంగా ఉంటుందో దానినే ఎంచుకోవాలి. స‌రైన అవాగాహ‌న లేక‌పోతే ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని