ఇ-పాల‌సీల జారీ గ‌డువు పెంచిన ఐఆర్‌డీఏఐ

ఎల‌క్ట్రానిక్‌ మోడ్ ద్వారా అందుకున్న ఇ-పాల‌సీల‌కు 30 రోజుల‌ ఫ్రీలుక్ పి‌రియ‌డ్ ఉంటుంది.

Published : 23 Mar 2021 17:11 IST

ఆన్‌లైన్‌లో పాలసీల జారీకి జీవిత బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గ‌డువును మరో ఆరు నెల‌లు పెంచుతున్నట్లు బీమా నియంత్ర‌ణ ప్రాదికార సంస్థ‌(ఐఆర్‌డీఏఐ) మంగ‌ళ‌వారం తెలిపింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఎల‌క్ట్రానిక్ పాల‌సీల జారీ గ‌డువును మ‌రో ఆరు నెల‌లు అంటే సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి వరకు  పాల‌సీదారుని ఇ-మెయిల్‌ ఐడికి ఎలక్ట్రానిక్‌గా పాలసీ పత్రాలు పంప‌డానికి అన్ని జీవిత బీమా సంస్థ‌ల‌ను, బీమా నియంత్ర‌ణ సంస్థ‌ ఆగస్టులో అనుమతించింది. ఇంతకుముందు, ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పాలసీని పంపిన‌ప్ప‌టికీ, భౌతిక రూపంలో కూడా పాల‌సీ ప‌త్రాల‌ను పంపించేవారు.

కోవిడ్ -19 వ్యాప్తి నేప‌ధ్యంలో,  పాలసీ పత్రాలను ముద్ర‌ణ‌, పంపించడంలో జీవిత బీమా సంస్థలు ఇబ్బందిని వ్యక్తం చేయ‌డంతో ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పాల‌సీదారుని ఇ-మెయిల్ ఐడికి ప‌త్రాల‌ను పంపే విధానాన్ని సెప్టెంబర్ చివరి వరకు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని తెలిపింది. అయితే పాల‌సీ దారుడు భౌతికంగా ప‌త్రాల‌ను కోరితే మాత్రం, ఏవిధ‌మైన ఛార్జీలు లేకుండా జారీ చేయాలి. 

కొనుగోలు చేసే వ్య‌క్తి స‌మ్మ‌తి ఉంటే భౌతిక పాల‌సీలు త‌ప్ప‌నిస‌రి కాదు. ఈ విధానం ద్వారా బీమా సంస్థ‌ల‌కు ఖ‌ర్చు ఆదా అవుతుంది.  స‌ర‌ళ‌మైన‌ కొనుగోలు ప్ర‌క్రియ, ఎక్కువ మంది జీవిత బీమా కొనుగోలు చేసే విధంగా ప్రోత్స‌హిస్తుంద‌ని సంస్థ‌లు చెబుతున్నాయి. 

ఆన్‌లైన్‌ పాల‌సీల‌కు ఫ్రీలుక్ పి‌రియ‌డ్ 30 రోజుల పాటు కొన‌సాగుతుంది. ఇంత‌కుముందు ఇది 15 రోజులు ఉండేది. పాల‌సీదారుడు, డిజిటల్ రూపంలో ఈ-మెయిల్ ద్వారా ప‌త్రాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఫ్రీ లుక్ పీరియ‌‌డ్ ప్రారంభ‌మవుతుంది. ఈ కాలంలో ఎటువంటి పెనాల్టీ లేకుండా పాల‌సీ ర‌ద్దు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి పాల‌సీదారుడు, పాల‌సీ తీసుకున్న త‌రువాత కూడా స‌మీక్షించుకోవ‌చ్చు. పాల‌సీలో తెలిపిన వివ‌రాలు, ష‌ర‌తులు ఒకే విధంగా ఉన్నాయో .. లేదో.. చెక్ చేసుకోవ‌చ్చు. పాల‌సీ నిబంధ‌న‌ల‌తో సంతృప్తిగా లేక‌పోతే పాల‌సీని ర‌ద్దు చేయాల్సిందిగా బీమా సంస్థ‌ను రీఫండ్ కోర‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని