ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి

బీమా రక్షణ, పొదుపునకు ఉపయోగపడే కొత్త పాలసీని  ‘బీమా జ్యోతి’ పేరుతో ఎల్‌ఐసీ విడుదల చేసింది. ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. పాలసీ వ్యవధి 15, 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు.

Updated : 23 Feb 2021 11:39 IST

ముంబయి: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ‘బీమా జ్యోతి’ పేరుతో తెచ్చిన ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.

పాలసీ వ్యవధి 15, 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. అయితే, ఇది లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. అంటే ప్రీమియం కొంత కాలం పాటే చెల్లిస్తాం. బీమా మాత్రం తర్వాత కొన్నేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన అవధి మనం తీసుకున్న పాలసీ అవధి కంటే ఐదేళ్లు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం పాలసీ అవధిని 20 ఏళ్లుగా ఎంచుకుంటే.. ప్రీమియం చెల్లించాల్సింది 15 ఏళ్ల వరకు మాత్రమే.

ఇక ఈ పాలసీ ద్వారా అందిస్తున్న మరో ప్రయోజనం కచ్చితమైన అదనపు చెల్లింపు (గ్యారంటీ అడిషన్‌). ప్రతి రూ.1,000 పాలసీ మొత్తానికి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. అంటే ఏడాదికి ఐదు శాతం కచ్చితమైన రిటర్న్‌ లభిస్తుంది. అలా పోగైన మొత్తాన్ని పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అదనపు చెల్లింపుల్లో కాంపౌండింగ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల పాలసీని 20 ఏళ్లకు తీసుకున్నారు. సంవత్సరానికి వెయ్యికి రూ.50 లెక్కన రూ.10 లక్షలకు రూ.50,000 అదనంగా చేరతాయి. అలా 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది రూ.50వేల చొప్పున అందుతాయి. అంటే పాలసీ కాలపరిమితి ముగిసే నాటికి రూ.10 లక్షలు అదనంగా వస్తాయి. ప్రతి ఏటా అదనంగా వస్తున్న రూ.50వేలపై ఎలాంటి రిటర్న్స్‌ ఉండవన్న విషయం గమనార్హం. ఇక ఇక దీంట్లో ఎలాంటి బోనస్‌లూ ఉండవు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్ల ఊగిసలాటను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌డీ రేట్లు ఇటీవల భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో ఎఫ్‌డీ వల్ల ఐదు శాతం రిటర్న్న్‌ వస్తాయనే నమ్మకం ప్రస్తుతం లేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దాదాపు ఐదు శాతం రిటర్న్న్‌ ఇచ్చే ఈ పథకం మదుపర్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. ఎలాంటి రిస్క్‌ లేకుండా, పూర్తి పన్ను మినహాయింపుతో 4-5 శాతం రిటర్న్స్‌ కావాలంటే ఈ పాలసీని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

పూర్తి వివరాలు...
కనీస పాలసీ మొత్తం రూ.1,00,000
గరిష్ఠ పరిమితి లేదు
పాలసీ అవధి 15 లేదా 20 ఏళ్లు
ప్రీమియం చెల్లించాల్సిన అవధి 10 లేదా 15 ఏళ్లు
ప్రవేశానికి కనీస వయసు 90 రోజులు
ప్రవేశానికి గరిష్ఠ వయసు 60 ఏళ్లు
మెచ్యూరిటీ నాటికి కనీస వయసు 18 ఏళ్లు
మెచ్యూరిటీ నాటికి గరిష్ఠ వయసు 75 ఏళ్లు

రూ.10 లక్షల పాలసీ మొత్తంతో 20 ఏళ్ల అవధిని ఎంచుకుంటే వచ్చే ప్రతిఫలం

పాలసీ అవధి: 20 ఏళ్లు
ప్రీమియం చెల్లించాల్సింది: 15 ఏళ్లు
పాలసీ మొత్తం: రూ.10,00,000
ఏడాది ప్రీమియం: రూ.82,545
అదనపు చెల్లింపులు: 20X50,000
కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తం: పాలసీ మొత్తం(రూ.10,00,000)+అదనపు చెల్లింపులు(రూ.20x50,000)= రూ.20లక్షలు

 

ఇవీ చదవండి...

ర్యాపిడో అద్దె సేవలు ప్రారంభం

కొత్త సఫారీ వచ్చేసింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని