Bill Gates: బిల్గేట్స్ లైంగిక వేధింపుల విచారణపై సమీక్ష
షేర్హోల్డర్ల సిఫార్సు మేరకు లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి విషయాల్లో కంపెనీ విధానాలను సమీక్షించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది....
న్యాయ విచారణ సంస్థను నియమించిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్: కంపెనీ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి ఉన్నతస్థాయి వ్యక్తులపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. షేర్హోల్డర్ల సిఫార్సు మేరకు లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి విషయాల్లో కంపెనీ విధానాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ అనే న్యాయ విచారణ సంస్థను నియమించుకుంది.
సమీక్షలో భాగంగా బిల్గేట్స్పై వచ్చిన ఆరోపణలపై బోర్డు జరిపిన దర్యాప్తును అరెంట్ సమీక్షించనుంది. అలాగే 2019 తర్వాత బోర్డు సభ్యులు సహా ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులపై వచ్చిన అన్ని రకాల వేధింపుల ఆరోపణల విషయంలో జరిపిన విచారణా ఫలితాలను పరిశీలించనుంది. అనంతరం బోర్డు, కంపెనీ యాజమాన్యానికి కొన్ని సిఫార్సులు చేయనుంది. వాటిని ఎలా అమలు చేయాలో కూడా సూచించనుంది. ఆ తర్వాత బోర్డు ఆ నివేదికను బహిర్గతం చేయనుంది. కంపెనీలో ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించనుందో కూడా వివరించనుంది. ఈ నివేదిక బహుశా వేసవిలో వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనలు.. వాటి పరిష్కారానికి కంపెనీ తీసుకున్న చర్యలపైన అరెంట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇతర కంపెనీల్లో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలతో మైక్రోసాఫ్ట్ నిబంధనలను పోల్చి రేటింగ్ కూడా ఇవ్వనుంది. తాము లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై అరెంట్ ఓ పరిష్కారాన్ని సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని షేర్హోల్డర్లలో ఒకరైన అర్జున క్యాపిటల్ ప్రతినిధి తెలిపారు. కంపెనీ విధానాలను సమీక్షించాలని తీర్మానించిన షేర్హోల్డర్లలో అర్జున క్యాపిటల్ ఒకటి.
ఈ అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దీన్ని ఓ అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం సమీక్షకే పరిమితం కాకుండా ఉద్యోగుల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని సంస్థను మరింత ఉన్నతీకరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీలోని ఎన్విరాన్మెంటర్, సోషల్, గవర్నెన్స్ (ESG) వంటి అంశాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు నైపుణ్యం గల మానవ వనరులను ఆకర్షించడంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అర్జున క్యాపిటల్ అభిప్రాయపడింది. దీర్ఘకాలంలో ఇది కంపెనీ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విధానాల సమీక్ష అనివార్యమైందని అభిప్రాయపడింది.
2007లో గేట్స్ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ సమయంలో ఓ మహిళా ఉద్యోగికి ఆయన అభ్యంతరకర ఈ-మెయిళ్లు పంపడమేగాక, తనను బయట వ్యక్తిగతంగా కలవాలని ఆమెను ఆహ్వానించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఏడాది తర్వాత విషయం కంపెనీ బోర్డు దృష్టికి వెళ్లింది. ఇది సరైన ప్రవర్తన కాదని, ఇలాంటివి మానుకోవాలని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల బృందం గేట్స్ను హెచ్చరించింది. ఈ-మెయిళ్లు పంపిన విషయాన్ని గేట్స్ కూడా అంగీకరించారని, మరోసారి ఇలాంటి పనులు చేయబోనని ఆయన బోర్డుకు తెలిపినట్లు గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. దీంతో గేట్స్పై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.
ఈ-మెయిళ్ల విషయం బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. తర్వాత బోర్డు సభ్యుడిగా కొనసాగిన ఆయన 2020 మార్చిలో అక్కడి నుంచి కూడా వైదొలిగారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్ అప్పట్లో ప్రకటించారు. అయితే, అది నిజం కాదని.. లైంగిక సంబంధాల వ్యవహారంపై కంపెనీ బోర్డు ఓ బయటి న్యాయ సంస్థతో విచారణ చేయించింది. ఈ క్రమంలోనే ఆయన బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో విచారణ ఎటూ తేలకుండానే ముగిసినట్లు అప్పట్లో కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం