పోస్టల్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌.. 10 ఏళ్లు దాటిన మైన‌ర్ల‌ పేరుపైనా ఖాతా!

పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాల్లో న‌ష్ట‌భ‌యం దాదాపు ఉండ‌ద‌నే చెప్పాలి. నెల నెలా కచ్చితమైన‌ ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ పథకంలో మ‌దుపు చేయొచ్చు.

Updated : 22 Nov 2021 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాల్లో న‌ష్ట‌భ‌యం దాదాపు ఉండ‌ద‌నే చెప్పాలి. నెల నెలా కచ్చితమైన‌ ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ పథకంలో మ‌దుపు చేయొచ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్లు, విశ్రాంత ఉద్యోగుల‌కు ఈ ప‌థ‌కం స‌రిగ్గా స‌రిపోతుంది. క‌నీసం రూ.1000 డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం ప్రారంభించిన స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీరేటు.. పెట్టుబ‌డి వ్య‌వ‌ధి మొత్తం వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల కచ్చిత‌మైన రాబ‌డి ఉంటుంది. ఈ పథకం గురించిన కొన్ని ముఖ్య విష‌యాలు..
1. అర్హ‌త‌: భార‌తీయ నివాసి అయిన వ్య‌క్తులు మాత్ర‌మే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతా తెరవగలరు. ఖాతాను వ్య‌క్తిగ‌తంగా గానీ, ఇద్ద‌రు లేదా ముగ్గురు జాయింట్‌గా గానీ తెర‌వొచ్చు. 10 ఏళ్ల పైబ‌డి వ‌య‌సున్న పిల్ల‌ల పేరుపై కూడా ఖాతాను తెరిచే వీలుంది. పిల్ల‌ల పేరుపై ఖాతా తెరిస్తే, వారికి 18 సంవ‌త్సరాలు నిండిన త‌ర్వాత ఖాతా వారికి బ‌దిలీ చేసి, మెచ్యూరిటీ మొత్తాన్ని అంద‌జేస్తారు.

2. డిపాజిట్ మొత్తం: ఈ ప‌థ‌కంలో డిపాజిట్లు రూ.1000 నుంచి ప్రారంభించొచ్చు. వ్య‌క్తిగ‌త ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.4.50 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్ష‌ల వర‌కు ఇందులో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ముగ్గురు వ్య‌క్తులు జాయింట్‌గా ఖాతా తీసుకున్న‌ప్ప‌టికీ గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్ష‌లే డిపాజిట్ చేయ‌గ‌ల‌రు. ఉమ్మ‌డి ఖాతాలో ఖాతాదారులంద‌రికీ స‌మానంగా వాటా ఉంటుంది.

3. మెచ్యూరిటీ: ఇందులో 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మ‌ర‌ణిస్తే ఖాతా మూసివేయ‌వ‌చ్చు. నామినీ/ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు ఖాతాలో ఉన్న‌ మొత్తాన్ని చెల్లిస్తారు. డ‌బ్బు వాప‌సు చేసే ముందు నెల వ‌ర‌కు వ‌డ్డీ చెల్లిస్తారు.

4. గడువుకు ముందే ఖాతా మూసివేస్తే: డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్‌ మొత్తం సొమ్ముపై 2 శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి, ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1 శాతం కోత విధిస్తారు.

5. వ‌డ్డీ: ఈ ప‌థ‌కంలో లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది కాబ‌ట్టి పెట్టుబడి సమయంలో ఉన్న వార్షిక వ‌డ్డీ రేటు మెచ్యూరిటీ వ‌ర‌కు వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల నెల నెలా వ‌చ్చే వడ్డీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 6.60 శాతంగా ఉంది. ఇప్పుడు ఖాతా తెరిస్తే మెచ్యూరిటీ పీరియ‌డ్ వ‌ర‌కు ఇదే వార్షిక వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది.

ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత వ‌డ్డీ చెల్లింపులు ప్రారంభించి మెచ్యూరిటీ వరకు కొన‌సాగిస్తారు. పెట్టుబడిదారుడు నెల నెలా వ‌డ్డీని క్లెయిమ్ చేయాలి. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రతి నెలా చెల్లించిన‌ వడ్డీని ఖాతాదారుడు స్వీకరించకపోతే, అలాంటి వడ్డీపై ఎలాంటి అదనపు వడ్డీ ల‌భించ‌దు. ఈ మొత్తాన్ని పొదుపు ఖాతా లేదా ఆర్‌డీ ఖాతాకు మ‌ళ్లించ‌మ‌ని కోరొచ్చు. ఇందుకు త‌గిన సూచ‌న‌లు పోస్టాఫీసు అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వ‌డ్డీ మొత్తాన్ని ఆర్‌డీ ఖాతా తెరిచి.. నెలనెలా అందులో జ‌మ‌య్యేలా చూసుకుంటే ఈ వ‌డ్డీ మొత్తంపై అద‌న‌పు వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాకు కూడా 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఆర్‌డీపై పోస్టాఫీస్ ప్ర‌స్తుతం అందిస్తున్న వ‌డ్డీరేటు 5.8 శాతం.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు