తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ ఆధునికీకరణ: ఎయిర్‌టెల్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తమ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. మొత్తం 10వేలకు పైగా మొబైల్‌ సైట్లను 4జీకి అభివృద్ధి చేసినట్లు

Updated : 30 Jun 2021 09:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తమ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. మొత్తం 10వేలకు పైగా మొబైల్‌ సైట్లను 4జీకి అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అత్యాధునిక ఎల్‌900 సాంకేతికత వినియోగించి, 4జీ కోసం 900 ఎంహెచ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు తెలిపింది. దీనివల్ల నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లలోపల కూడా కవరేజీలో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. రహదారులు, రైలుమార్గాల్లోనూ దీన్ని విస్తరించామని తెలిపింది. ఇప్పటికే లైవ్‌ 5జీ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రయత్నిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ అవ్నీత్‌ సింగ్‌ పూరీ తెలిపారు.

జులై 22న విపణిలోకి ఇ-ట్రాన్‌: ఆడి

దిల్లీ: జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ ఆడి తమ విద్యుత్‌ ఎస్‌యూవీలైన ఇ-ట్రాన్‌, ఇ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌లను వచ్చే నెల 22న భారత విపణిలోకి విడుదల చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. రూ.5 లక్షల ముందస్తు చెల్లింపుతో, బుకింగ్‌లు ప్రారంభించినట్లు పేర్కొంది. ఇ-ట్రాన్‌, ఇ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ల్లో డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంటుందని, 300 కిలోవాట్లు/408 హెచ్‌పీ సామర్థ్యంతో 95 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో రూపొందించినట్లు తెలిపింది. 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. ఈ రెండు కార్లను 11 కిలోవాట్ల ఏసీ హోమ్‌ ఛార్జర్‌తో ఛార్జింగ్‌ చేసుకోవచ్చని, 8.5 గంటల్లో ఇవి ఛార్జ్‌ అవుతాయని తెలిపింది.

సంక్షిప్తంగా

వన్‌వెబ్‌లో భారతీ హవా: శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ వన్‌వెబ్‌లో అదనంగా 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3800 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు భారతీ గ్రూప్‌ ప్రకటించింది. తాజా పెట్టుబడితో వన్‌వెబ్‌లో అతిపెద్ద వాటాదారుగా మారనుంది. తాజా లావాదేవీ పూర్తయితే ఆ సంస్థలో భారతీ వాటా 38.6 శాతానికి పెరుగుతుంది.

జీఎం వాహనాలు వెనక్కి: అమెరికాలో 3,80,000కు పైగా పాత ఎస్‌యూవీలను జనరల్‌ మోటార్స్‌ వెనక్కి పిలిపిస్తోంది. వీటిలో తలెత్తిన సస్పెన్షన్‌ సమస్యలను పరిష్కరించనుంది.

నక్షత్ర వరల్డ్‌ లిక్విడేషన్‌: మెహుల్‌ ఛోక్సీకి చెందిన నక్షత్ర వరల్డ్‌ లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. కంపెనీ రుణదాతల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ బకాయిలు రూ.459 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.145 కోట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది.

ఎఫ్‌ఎంసీజీకి కష్టాలు: కరోనా రెండో దశ వల్ల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం గిరాకీపై ప్రతికూల ప్రభావం పడిందని, నిర్వహణపరంగా చూస్తే అత్యంత కష్టతర త్రైమాసికాల్లో ఒకటిగా మారిందని టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ తెలిపింది. అనిశ్చితి, పెరిగిన టీ ధరల కారణంగా మార్జిన్లపై ఒత్తిడితో కంపెనీ ఆదాయంపై ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది. గత 15 రోజుల నుంచి గిరాకీ మళ్లీ పెరుగుతోందని వెల్లడించింది.

1300 ఉద్యోగాలు: జపాన్‌కు చెందిన డేటా ఎనలిటిక్స్‌ సంస్థ ఉగమ్‌ ఈ ఏడాది 1300కు పైగా అనలిటిక్స్‌, టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు