e-RUPI: డిజిటల్ చెల్లింపుల్లో మరో ముందడుగు.. ‘ఇ-రూపీ’
భారత్లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. అదే ‘ఇ-రుపీ’. దీన్ని ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు...
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. అదే ‘ఇ-రూపీ’. దీన్ని సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.
ఇ-రూపీ అంటే..
ఈ వ్యవస్థలో ఒక క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. వీటినే ఇ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ల లాంటివే. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.
ఈ వోచర్లను ఎలా జారీ చేస్తారు..
ఇ-రూపీ వ్యవస్థను అమలు చేసేందుకు కొన్ని కీలక బ్యాంకులు ముందుకు వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు కూడా రానున్న రోజుల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. ఫోన్ నంబరుతో సహా లబ్ధిదారుల వివరాలను వారికి అందజేయాలి. వోచర్ విలువ ఎంతో కూడా తెలియజేసి.. మొత్తం సొమ్మును చెల్లించాలి. అలాగే ఆ చెల్లింపులు ఎందుకోసం చేస్తున్నారో కూడా తెలియజేయాలి. అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి.
ఎక్కడ ఉపయోగించే వీలుంది?
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలు ఇ-రూపీ ద్వారా మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఎలా భిన్నమైంది?
గూగుల్ పే, యూపీఐ, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల వలే ఇ-రూపీ ఒక పేమెంట్ ప్లాట్ఫారం కాదు. ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు.
ఎలా రీడీమ్ చేసుకోవాలి?
వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ఫోన్ లేని వారు వోచర్ కోడ్ చెప్పినా చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు