జాతీయ జ‌నాబా ప‌ట్టిక (ఎన్‌పీఆర్) గురించి క్లుప్తంగా..

ఎన్‌పీఆర్‌ నవీకరణకు రూ.8,500 కోట్లు కేటాయించేందుకు కేంద్ర‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.....

Updated : 01 Jan 2021 18:59 IST

జాతీయ జ‌నాబా ప‌ట్టిక (ఎన్‌పీఆర్‌) ను అప్‌డేట్ చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రూ.3,941.35 కోట్లు కేటాయించ‌నున్నారు. తొలిసారిగా 2010లో ఎన్‌పీఆర్‌ కోసం డేటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే నిర్వహించి తొలిసారి అప్‌డేట్ చేశారు. ఎన్‌పీఆర్‌ను సుల‌భంగా చెప్పాలంటే దేశంలో నివసించే జనాబా ప‌ట్టిక‌. ఇందులో గ‌త ఆరు నెల‌ల నుంచి దేశంలో నివ‌సిస్తున్న వారు, వ‌చ్చేఆరు నెల‌లు కూడా అక్క‌డే నివ‌సించేవారి జాబితా ఉంటుంది.

1.జనాభా సమాచారాన్ని మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడిచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదేచోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడి వివరాలు తెలుసుకుంటారు. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం. దీనిని పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వం (పౌరుల నమోదు మ జాతీయ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు 2003 ప్రకారం చేప‌ట్ట‌నున్నారు.

2.గతంలో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం కూడా 2011 జ‌నాబా లెక్క‌ల కోసం 2010లో తొలిసారి ఎన్‌పీఆర్‌ చేపట్టి గుర్తింపు కార్డులను మంజూరు చేసింది. ఆ సమాచారాన్ని 2015లో అప్‌డేట్‌ చేశారు. ఎన్‌పీఆర్‌ ద్వారా దేశంలోని సాధారణ నివాసితుల జాబితాను అప్‌డేట్‌ చేయనున్నారు.

3.ఇప్పుడు ఈ ఎన్‌పీఆర్‌ను 2021 జనగణనతో అప్‌డేట్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2020 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య అసోం మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌పీఆర్‌ ప్రక్రియ చేపట్టనుంది. అసోంలో ఇటీవలే జాతీయ పౌర రిజిస్టర్‌ నమోదు చేపట్టినందున ఆ రాష్ట్రాన్ని మినహాయించారు.

4.జాతీయ జనగణన రిజిస్టర్‌ కోసం ఎలాంటి పత్రాలు, బయో మెట్రిక్‌ అవసరంలేదు. సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తే చాలు. అంతకు మించి ఆధార్‌ సహా ఎటువంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరంలేదు. ఇది ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే ప్రక్రియ. భారత్‌లో ఎవరు ఉంటారో వారందరి వివరాలు నమోదు చేస్తారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా నిజమైన లబ్ధిదారులకు చేరవేయడమే లక్ష్యం అని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ అన్నారు.

5.మొత్తం ఎన్‌పీఆర్ ప్ర‌క్రియను హోం మంత్రిత్వ శాఖ ఆద్వ‌ర్యంలో రిజిస్ర్టార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) కార్యాల‌యం చేప‌ట్ట‌నుంది. 2021 జ‌నాబా గ‌ణాంకాల‌కు ముందు ఇది పూర్తికానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని