రేప‌టి నుంచి అమ‌ల్లోకి రానున్న టీడీఎస్ కొత్త రూల్స్‌

 టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేసేవారు.. వ్యక్తుల శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను నమోదు చేయగానే ఆ ‘పత్యేక వ్యక్తుల’కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయని సీబీడీటీ తెలిపింది

Published : 30 Jun 2021 12:17 IST

గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌)  రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది రేప‌టి నుంచి అంటే జులై 1 నుంచి అమ‌లులోకి రానుంది. 

అటువంటి వారిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్‌ పర్సన్స్‌)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీ టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఫైనాన్స్ యాక్ట్ ద్వారా సెక్ష‌న్ 206AB, 206CCAల‌ను ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లో చేర్చారు. ఈ కొత్త పంక్ష‌న్ ద్వారా సెక్ష‌న్ 206AB, 206CCA కింద‌కి వచ్చే ప్ర‌త్యేక వ్య‌క్తుల‌ను టీడీఎస్ వ‌సూలు చేసే వారు సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఈ పంక్ష‌న్ ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిపోర్టింగ్ పోర్ట‌ల్ ద్వారా ఇప్ప‌టికే ప‌నిచేస్తుందని సీబిడీటి వెల్ల‌డించింది. 

ఈ కొత్త టూల్ ఏవిధంగా ప‌నిచేస్తుంది?

సింగల్ పాన్ సెర్చ్‌..
ప‌న్ను వ‌సూలు చేసే వారు.. ఒక వ్య‌క్తిని పత్యేక వ్యక్తి అవునా.. కాదా.. అని తెలుసుకునేందుకు అత‌ని పాన్(శాశ్వ‌త ఖాతా సంఖ్య) నెంబ‌రును పోర్ట‌ల్‌లో న‌మోదు చేయాల్సి ఉంటుంది. పాన్ నెంబ‌రు ఆధారంగా చెక్ చేసి పత్యేక వ్యక్తి అవునా కాదా తెలియ‌జేస్తుంది. దీన్ని పీడీఎఫ్ ఫార్మెట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

బ‌ల్క్ సెర్చ్‌..
గుర్తించాల్సిన వ్య‌క్తుల పాన్ నెంబ‌ర్ల‌ను బ‌ల్క్‌గా పోర్ట‌ల్‌లో న‌మోదు చేయాలి. యుటిలిటీ  ప్ర‌త్యేక వ్య‌క్తులుగా గుర్తించిన వారి వివ‌రాల‌ను ఒక ఫైల్ రూపంలో అందిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని సిబిడిటీ వివ‌రించింది. 

టీడీఎస్ వ‌సూలు చేసేవారు.. టీడీఎస్ లేదా టీసీఎస్ డిడ‌క్ట్ చేయవ‌ల‌సిన వారి పాన్ నెంబ‌రు ఫంక్ష‌నాలిటీ ద్వారా త‌నిఖీ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పూర్తిచేయాలి. మునుపటి సంవత్సరాలు 2018-19, 2019-20 తీసుకుని, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌ని వారి జాబితాను ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 ప్రారంభంలోనే సిద్ధం చేసింది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. 

కోవిడ్ -19 సెకెండ్ వేవ్ నేప‌థ్యంలో ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి  వివిధ గ‌డువు తేదిల‌ను ఇటీవ‌లే పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికానికి టీడీఎస్ ఫైల్ చేసేందుకు కూడా జులై 15 వ‌ర‌కు స‌మ‌యం ఉంది. 

ముందు సంవ‌త్స‌రం టీడీఎస్ డిడ‌క్ష‌న్లు ప్ర‌తీసారి రూ.50వేల కంటే త‌క్కువున్న‌ప్పుడు, లేదా గత 2 సంవ‌త్స‌రాలుగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా దాఖ‌లు చేస్తుంటే ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు. 

ఇంకా, జీతం ఆదాయం (192), లాటరీ (194 బి), గుర్రపు పందెం (194 బిబి), పిఎఫ్ (192 ఎ), ట్రస్ట్ ఆదాయం (194 ఎల్‌బిసి),  నగదు ఉపసంహరణ (194 ఎన్) పై టిడిఎస్‌ను తగ్గించాల్సి ఉంటే, ఈ  సెక్ష‌న్ కింద‌ ప్రావిస‌న్స్ వ‌ర్తించ‌వు. అదేవిధంగా శాశ్వ‌త సంస్థ‌లు లేని ఎన్ఆర్ఐల విష‌యంలోనూ టిడిఎస్ అధిక రేటు వర్తించదు.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి వద్ద అధిక పన్ను వసూలు చేయాలని 2021 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సర్క్యులర్‌ జారీ చేసింది.  టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేసేవారు.. వ్యక్తుల శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను నమోదు చేయగానే ఆ ‘పత్యేక వ్యక్తుల’కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఆయా వ్యక్తులు అధిక శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని