కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌..మ‌రింత సుల‌భంగా ఐటీఆర్‌ 

ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ జూన్‌7, 2021 నుంచి అందుబాటులోకి రానుంది.

Updated : 28 May 2021 14:31 IST

ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.  ఈ కొత్త పోర్ట‌ల్ www.incometax.gov.in జూన్ 7, 2021 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆశాఖ తెలిపింది. కొత్త ఇ- పోర్ట‌ల్ స‌హాయంతో మ‌రింత సులువుగా, సౌక‌ర్య‌వంతంగా ప‌న్ను చెల్లింపుదారులు త‌మ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌గ‌లుగుతార‌ని ఐటీ శాఖ విశ్వాసం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ద‌శ‌ల‌వారీగా తొల‌గిస్తున్నామ‌ని, వ‌చ్చే నెల ఆరంభం నుంచి అంటే జూన్‌1 నుంచి 6వ తేది వ‌ర‌కు.. ఆరు రోజుల పాటు పోర్ట‌ల్ అందుబాటులో ఉండ‌ద‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల మండ‌లి తెలిపింది.  

పాత ఇ-పోర్ట‌ల్ www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త ఇ-పోర్ట‌ల్ www.incometaxgov.inకు మార్పు చెందే క్ర‌మంలో ఆరు రోజుల బ్యాక్ అవుట్ పిరియ‌డ్ ఉంటుంది. కాబ‌ట్టి ప‌న్నుచెల్లింపుదారులు అవ‌స‌రంగా పూర్తిచేయాల్సిన ప‌నులు(ఏదైనా స‌బ్మిట్ చేయాల్సి వచ్చినా, అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌) వంటివి జూన్‌1వ తేది లోపుగా పూర్తిచేయాల‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డ్ తెలిపింది. 

కొత్త పోర్ట‌ల్‌తో ప్ర‌యోజ‌నాలు..
ప‌న్నుచెల్లింపుదారుల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రిఫండ్‌ల‌ను జారీ చేసేందుకు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించిన వెంట‌నే ప్రాసెసింగ్ చేసే విధంగా కొత్త ఇ-పోర్ట‌ల్ ఉంటుంది. 
* ప‌న్ను చెల్లింపుదారులు ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చ‌ర్య‌లు, అప్‌లోడ్‌లు, పెండింగ్ చ‌ర్య‌లు, త‌రువాత చేయాల్సిన ప‌నులు అన్ని ఒకే డాష్‌బోర్డ్‌లో క‌నిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 
* ప‌న్ను-సంబంధిత విష‌యాల‌లో పెద్ద‌గా అవ‌గాహ‌న లేనివారు కూడా  సుల‌భంగా రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ఐటీఆర్ ప్రీప‌రేష‌న్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది పూర్తి ఉచితంగా సేవ‌లు అందిస్తుంది. క‌నీస స‌మాచారం ఇవ్వ‌డం ద్వారా ప్రీ-ఫైల్లింగ్‌కు ఇది స‌హాయ‌ప‌డుతుంది. 
* ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌హాయ‌ప‌డేందుకు ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్‌.. ప‌న్నుచెల్లింపుదారులు త‌రుచుగా అడిగే ప్ర‌శ్న‌ల‌కు వీడియోలు, ట్యుటోరియ‌ల్స్ రూపంలో త‌క్ష‌ణ‌మే స‌మాధానం ఇస్తుంది. చాట్‌బాట్‌/లైవ్ ఏజెంట్ ద్వారా కూడా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవ‌చ్చు. 
* డెస్క్‌టాప్ ద్వారా ఇ-పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉన్న అన్ని ప్ర‌ధాన ఫంక్ష‌న్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. మొబైల్ నెట్‌వ‌ర్క్‌తో ఎప్పుడైనా యాక్సిస్ చేయ‌వ‌చ్చు. 
* కొత్త ఆన్‌లైన్ ప‌న్ను చెల్లింపు వ్య‌వ‌స్థ‌లోని కొత్త పోర్ట‌ల్‌లో.. ప‌లు పేమెంట్  ఆప్ష‌న్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌, ఆర్‌టీజీఎస్‌/  నెఫ్ట్‌, క్రెడిట్ కార్డులు ద్వారా ప‌న్నుచెల్లింపుదారుని ఏ బ్యాంకులోని.. ఖాతా నుంచైనా సౌక‌ర్య‌వంతంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. 

గ‌మ‌నిక‌..
జూన్‌1 వ తేది నుంచి జూన్‌6 తేది వ‌ర‌కు ఉన్న బ్లాక్అవుట్ పిరియ‌డ్‌లో ప‌న్ను చెల్లింపుల‌కు సంబంధించి ఎటువంటి ముఖ్య‌మైన తేదిల‌ను ఆదాయ‌పు శాఖ ప్ర‌క‌టించ‌దు. కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ జూన్ 7వ తేది నుంచి అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల‌కు, డిపార్మెంట్‌ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన ప‌నుల‌ను వాయిదా వేసే అవ‌కాశం ఉంది. ప‌న్ను చెల్లింపుదారులు కొత్త పోర్ట‌ల్‌కు అల‌వాటు ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి కేసులు/  ఫిర్యాదుల‌కు సంబంధించిన విచార‌ణ‌ల‌ను జూన్ 10వ తేది త‌ర‌వాతకు వాయిదా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని