కోవిడ్ 19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కి బీమా వర్తిస్తుందా? 

క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎదుర‌య్యే దుష్ప్ర‌భావాలు, టీకా వేయ‌డం వ‌ల్ల త‌లెత్తే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై బీమా స‌దుపాయం ఉండాలన్ననిబంధన  ఏదీ లేదు. 

Updated : 04 Mar 2021 12:11 IST

'కోవిడ్‌-19' నివార‌ణ చ‌ర్య‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 16 నుంచి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌యిన విష‌యం తెలిసిందే. హెల్త్ కేర్‌, అవ‌స‌ర‌మైన ఇత‌ర కార్మికుల‌తో తొలి ద‌శ వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు. పూనేకి చెందిన సీరం ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇండియా వారి 'కోవిషిల్డ్', హైద‌రాబాద్‌కి చెందిన భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ వారి 'కోవాగ్జిన్'‌ టీకాల‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కింద భార‌త్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఈ రెండు టీకాల‌ను వినియోగిస్తున్నారు. 

టీకాలు వేయడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలు లేదా వైద్య సమస్యలకు బీమా స‌దుపాయం ఉండాల‌న్న నిబంధ‌న‌ లేదు. కోవిడ్‌-19 టీకా కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారులు పూర్తి స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్ర‌తీ టీకా కేంద్రం వ‌ద్ద అనాఫిలాక్సిస్ (తీవ్ర అలర్జీ) కిట్లు అందుబాటులో ఉంటాయి. ఏదైనా స‌మ‌స్య ఉంటే ఏఈఎఫ్ఐ (అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్)కి రిఫ‌ర్ చేస్తారు. ఒక వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాలపాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తిలో దుష్ప్రభావాలు క‌నిపిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. ఇంటికి వెళ్లాక దుష్ప్రభావాలు తలెత్తినా ఏఈఎఫ్ఐ మేనేజ్‌మెంట్ వారు ప్ర‌జారోగ్య సౌక‌ర్యాల‌తో ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. అంతేగానీ టీకా తీసుకున్న వారికి ఎదుర‌య్యే దుష్ప్ర‌భావాలు, వైద్య స‌మ‌స్య‌ల‌కు బీమా స‌దుపాయం ఉండాలన్న నిబంధనలు లేవని ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే గ‌తంలోనే స్పష్టంచేశారు.

ఫిబ్ర‌వ‌రి 4, వ‌ర‌కు కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం ల‌బ్ధిదారుల‌లో 81 మందిలో స్వ‌ల్ప‌ ప్ర‌తికూల ప్ర‌భావాలు క‌నిపించాయ‌ని ప్ర‌భుత్వం తెలిపంది. ఇందులో 'కోవాగ్జిన్'‌ తీసుకున్న వారిలో 0.096 శాతం, 'కోవిషిల్డ్' తీసుకున్న వారిలో 0.192 శాతం మందిలో  ఆందోళన, వికారం, జిడ్నెస్, మైకము, జ్వరం, నొప్పి, దద్దుర్లు, తలనొప్పి వంటి చిన్నపాటి ప్ర‌తికూల‌త‌లు క‌నిపించాయి. అయితే ప్రస్తుతం వారంతా కోలుకున్నార‌ని ప్ర‌భుత్వం వ‌ర్గాయి వెల్ల‌డించాయి. 

కోవిడ్‌-19 వ్యాక్సిన్ ప్ర‌క్రియను ప‌ర్య‌వేక్షించేందుకు‌, ప్ర‌తికూల ప్ర‌భాల‌పై త‌క్ష‌ణ‌మే వైద్య సేవ‌ల‌ను అందించేందుకు ధృడ‌మైన‌ ఏఈఎఫ్ఐ నిఘా వ్య‌వ‌స్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రమం తప్పకుండా టీకాల కవరేజీని పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని