
కరోనా టీకాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం
ఓఈసీడీ
పారిస్: కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుకున్నదాని కంటే వేగంగా పుంజుకుంటోందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. కరోనా టీకా ప్రయోగాలు విజయవంతం అవ్వడం, అమెరికా ఉద్దీపనలు ఇందుకు దోహదం చేశాయని పేర్కొంది. అయితే నిరుద్యోగ సమస్య మాత్రం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ఓఈసీడీ అభిప్రాయపడింది. ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరానికి 5.5 శాతంగాను, వచ్చే సంవత్సరానికి 4 శాతంగాను అంచనా వేసింది. ఈ సంస్థ గత డిసెంబరులో వేసిన అంచనాల ప్రకారం.. 2021 వృద్ధిరేటు 4.2 శాతం, 2022కి 3.7 శాతం కంటే తాజా అంచనాలు మెరుగవ్వడం గమనార్హం. ఈ ఏడాది మధ్య కల్లా కరోనా ముందునాటి స్థాయులకు మించి ప్రపంచ ఉత్పత్తి నమోదవుతుందని ఓఈసీడీ భావిస్తోంది. చైనా, అమెరికా లాంటి దేశాల్లో వృద్ధి వేగవంతంగా ఉంటుందని, మరికొన్ని దేశాలకైతే 2022 చివరి వరకు ఇబ్బందులు కొనసాగుతాయని హెచ్చరించింది. కొవిడ్ వైరస్ కొత్త రకాలు, వ్యాక్సిన్ పంపిణీ నెమ్మదిగా సాగుతున్నందున, వ్యాపారాలు, నియామకాలు పెద్దగా పుంజుకోకపోవచ్చని తెలిపింది. కొవిడ్-19 ముందుతో పోలిస్తే ధనిక దేశాల్లో నిరుద్యోగిత పెరిగిందని, పేద దేశాల్లో ఉద్యోగ కోతల కారణంగా పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయని తెలిపింది.
ఇవీ చదవండి....
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.