పీపీఎఫ్ Vs ఈఎల్ఎస్ఎస్
పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ రెండింటినీ పోల్చిచూడటం సరికాదు. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులు పెట్టచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ఈ రెండు పన్ను ఆదా చేసే పొదుపు పథకాలు. సెక్షన్ 80సీ కింద ఈ రెండింటిలో పెట్టుబడులకు ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు అవకాశం ఉంటుంది. అయితే, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించే పథకాలకు వేర్వేరు రాబడులు, రిస్క్, లాక్-ఇన్ పీరియడ్, పన్నులు ఉంటాయి. పన్ను ఆదా చేసేందుకు పెట్టుబడులు పెట్టేముందు వీటన్నింటిని పరిశీలించాలి.
పీపీఎఫ్..
పదవీ విరమణ జీవితం కోసం నిధిని ఏర్పాటు చేసుకునేందుకు, పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతీయులు ఈ స్కీమ్లో చేరవచ్చు. పిల్లల పేరుతో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ జాయింట్గా ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఏడాదికి కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఖాతాలో జమచేయవచ్చు. 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత 5 సంవత్సరాల చొప్పున కాలవ్యవధి పొడిగించుకోవచ్చు. ఏడవ ఆర్ధిక సంవత్సరం నుండి పాక్షిక నగదు ఉపసంహరణలను అనుమతిస్తారు. అయితే, క్రితం సంవత్సర చివరిలో ఉన్న నిల్వపైగానీ లేదా అంతకు మునుపు నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న నిల్వపై గానీ, ఏది తక్కువైతే, దానిపై 50 శాతం వరకు పాక్షిక నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు.
ఈఎల్ఎస్ఎస్..
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పన్ను ప్రయోజనాలను, స్టాక్ మార్కెట్ల రాబడులను అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్లో మొత్తం నిధి నుంచి 80 శాతం నిధిని లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్ ఈక్విటీలలో పెట్టుబడి పెడతారు. అందువల్ల మల్టీ కాప్ ఫండ్ల మాదిరిగానే రాబడులు ఉంటాయి. కనీస లాక్ ఇన్ పిరియడ్ 3 సంవత్సరాలు. ఇతర ఈక్విటీ ఫండ్లలో లాగా ఇందులో కూడా కనీసం 10 ఏళ్ళు మదుపు చేస్తే మంచి రాబడి పొందే వీలు ఉంటుంది, స్వల్ప కాలం లో నష్ట భయం ఉంటుంది.
పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ మధ్య ఉన్న తేడా ఏంటి?
పన్ను..
పన్ను ఆదా చేసే పెట్టుబడులకు పీపీఎఫ్ ప్రాచుర్యం పొందింది. ఇది డెట్ పథకం, కచ్చితమైన రాబడిని అందిస్తుంది. పెట్టుబడులు, రాబడి, ఉపసంహరణపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు పన్ను మినహాయింపు, దానిపై లభించే రాబడికి పన్ను వర్తించదు. ఇక పూర్తి ఉపసంహరణపై కూడా పన్ను లేదు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ సంబంధిత సాధనాలలో పెట్టుబడులు పెడుతుంది. ఇక్కడ కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, 1 ఏడాది దాటిన తర్వాత పెట్టుబడులపై రాబడి లక్ష దాటితే 10 శాతం పన్ను వర్తిస్తుంది.
లాక్-ఇన్ పీరియడ్..
పీపీఎఫ్ మెచ్యూరిటీ గడువు 15 సంవత్సరాలు. అయితే, ఏడు సంవత్సరాల తర్వాత పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో ఐదు సంవత్సరాల తర్వాత ముందస్తుగా ఖాతా మూసివేయవచ్చు. ఇక ఈఎల్ఎస్ఎస్ లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించే అన్ని పొదుపు పథకాల కంటే తక్కువ లాక్-ఇన్ పీరియడ్ కలిగిన ఒకే ఒక పథకం ఈఎల్ఎస్ఎస్.
రాబడి..
పీపీఎఫ్ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. దీనిపై వడ్డీ రేటు త్రైమాసికానికి ఒకసారి సవరిస్తారు. ప్రస్తుతం 7.10 శాతం ఉంది. ఇక ఈఎల్ఎస్ఎస్ రాబడి మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన స్టాక్స్ కదలికలను బట్టి ఫండ్ పనితీరు ఉంటుంది.
పెట్టుబడి విధానం..
ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులు ఒకేసారి ఎక్కువ మొత్తంలో లేదా క్రమానుగతంగా (సిప్) పెట్టవచ్చు. అయితే, సిప్ చేస్తే ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ వర్తిస్తుందని గమనించండి. కాబట్టి, ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టడం మేలు. అదే విధంగా పీపీఎఫ్లో కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లు పెట్టుబడులు చేయవచ్చు.
పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్? ఏది ఎంచుకోవాలి..
పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ రెండింటినీ పోల్చిచూడటం సరికాదు. రెండు వేర్వేరు పథకాలు. కానీ పన్ను విషయంలో మాత్రం రెండింటికీ సెక్షన్80 సీ కింద మినహాయింపు లభిస్తుంది. ఇదొక్కటే రెండింటిలో కామన్. ఇక కేవలం పన్ను ఆదా కోసం కాకుండా దీర్ఘకాలికంగా మీకు అనుకూలంగా ఉండే పథకాన్ని ఎంచుకోవడం మంచిది. పీపీఎఫ్ డెట్ పథకం వంటిది, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ పథకం. ఇందులో రాబడి మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ ఏది ఎంచుకోవాలనేది పెట్టుబడిదారుడి రిస్క్ సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. పీపీఎఫ్లో రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడితో పాటు, పన్ను మినహాయింపు లభిస్తుంది. రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడనివారు దీనిని పరిశీలింవచ్చు. అయితే 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈక్విటీలలోకి అడుగు పెట్టాలనుకునేవారు, రిస్క్ తీసుకునేవారు ఈఎల్ఎస్ఎస్ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అదిగమించడంతో పాటు దీనిపై మంచి రాబడి ఆశించవచ్చు. గత కొద్ది ఏళ్లలో వీటి రాబడి అంతగా బాలేదనే చెప్పాలి. పన్ను ఆదా కోసం ఇతర పధకాలను ఎంచుకోగలిగితే, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవడం మేలు. పన్ను ఆదా చేసే పథకాలు మీ పోర్ట్పోలియోలో భాగంగా తప్పనిసరిగా ఉండాలి. అది సంవత్సరం ప్రారంభంలోనే ఈ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి. చివరి నిమిషంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం సరైన విధానం కాదని ఆర్థిక నిపుణుల సలహా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె