జేబుల్ని కాల్చేస్తున్న పెట్రో మంటలు

అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గినప్పటికీ- భారత్‌లో వాటి ధరలు మాత్రం దిగిరావడంలేదు. అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన పెట్రోలు, డీజిల్‌లను మన దేశంలో........

Updated : 17 Oct 2022 14:40 IST

ఏమిటి ప్రత్యామ్నాయాలు?

అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గినప్పటికీ- భారత్‌లో వాటి ధరలు మాత్రం దిగిరావడంలేదు. అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన పెట్రోలు, డీజిల్‌లను మన దేశంలో విక్రయించకపోవడం అందుకు కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటూ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. డాలర్‌ విలువ పెరిగినప్పుడు మార్పిడి రేటులో మనం దిగుమతులపై అధిక మొత్తంలో రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయలతో పోల్చినప్పుడు డాలర్‌ విలువ క్రమేపీ పెరుగుతోంది. చమురు ధరలకు సంబంధించి ఒక డాలరు తగ్గితే భారత్‌లో ఒక లీటరు చమురుకు యాభై పైసలు తగ్గాలి. కానీ, డాలర్‌ విలువ పెరుగుతుండటంతో చమురు దిగుమతులపై మనం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. 2017 జూన్‌ నుంచి భారత్‌లో చమురు ధరలను- రోజువారీ అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు, డాలరు నుంచి రూపాయి మార్పిడి రేట్ల ఆధారంగా నిర్ణయిస్తున్నారు.

రాష్ట్రాల వాటాకు గండి
లీటరు పెట్రోలుపై నవంబరు 2014లో ఎక్సైజ్‌ సుంకం రూ.9.20, డీజిల్‌ మీద లీటరుకు రూ.3.96 ఉండేది. డిసెంబర్‌ 2017నాటికి అది రూ.21.48, రూ.17.33కు; జనవరి 2021నాటికి రూ.32.98, రూ.31.83కు పెరిగింది. కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకం, రహదారి సుంకం విధించింది. దీని పర్యవసానంగా సాధారణ ఎక్సైజ్‌ సుంకంలో పెరుగుదల లేకపోవడంవల్ల, కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటాకు గండి పడుతుంది. కేంద్రం వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద 2021-22 బడ్జెట్లో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.50, రూ.4.00 విధించిన సెస్‌లో భాగంగా- పెట్రోల్‌, డీజిల్‌ మీద సాధారణ ఎక్సైజ్‌ సుంకంలో వరసగా రూ.1.50, రూ.3.00 కోత విధించింది. దీనివల్ల కేంద్రం ప్రకటించినట్లు ప్రజలమీద అదనపు పన్ను భారం లేకపోయినప్పటికీ, రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటాకు నష్టం వాటిల్లిన మాట వాస్తవం.

కేంద్రంనుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాల్లో పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కేవలం రూ.1.48, రూ.1.83లో 41శాతం మాత్రమే లభిస్తుంది. అంటే ఈ పెట్రోల్‌, డీజిల్‌ పన్నులలో సింహ భాగం రూ.31.50,    రూ.30 పూర్తిగా కేంద్రం ఖజానాలోకి వెళుతుంది. గడచిన దశాబ్దకాలంలో చమురుపై ప్రభుత్వాలు విధించిన పన్ను భారత స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతానికి సమానం. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే మొత్తం ఎక్సైజ్‌ సుంకంలో 85-90శాతం కేవలం చమురు మీదే వస్తోంది. కేంద్రానికి వచ్చే వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయంలో 24శాతం చమురు మీద సమకూరుతోంది. 2014-15లో ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.1.72 లక్షల కోట్లు; 2019-20 నాటికి అది రూ.3.34 లక్షల కోట్లకు అంటే 94శాతం మేర పెరిగింది. ఇదే కాలంలో రాష్ట్రాలు సైతం చమురుపై పన్నులద్వారా తమ వాటాను రూ.1.60 లక్షల కోట్ల నుంచి రూ.2.21 లక్షల కోట్లకు అంటే 37శాతం మేర పెంచుకున్నాయి.

దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం
కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ‘తుమ్మితే ఊడిపోయే ముక్కు’లా ఉంది. కాబట్టే ఆదాయంలో సింహ భాగాన్ని పెట్రోలు, డీజిల్‌లపై పన్నుల రూపేణా వారు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒత్తిడి తెస్తే చమురు మీద పన్నులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నామ మాత్రంగా కోతపెడతాయేమోగానీ- వాటి ధరలు గణనీయంగా తగ్గే సూచనలు మాత్రం లేవు. ప్రభుత్వం 2017లో తీసుకువచ్చిన జీఎస్‌టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు వస్తుసేవల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో సాలుకు 14శాతం పెరుగుదలకు హామీ ఇస్తూ, 2017-18 నుంచి 2021-22 వరకు అందులో తగ్గుదల ఉంటే దాన్ని భర్తీ చేసే విధంగా కేంద్రం అంగీకరించింది. ఈ హామీని కేంద్రం 2019-20 వరకు నిలబెట్టుకుంది కూడా. కానీ 2020-21లో కొవిడ్‌ ప్రభావంవల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలదాకా గండి పడుతుందని అంచనాల్లో తేలింది. దాంతో రాష్ట్రాల ఆదాయానికి ఇచ్చిన 14శాతం కనీస పెరుగుదల హామీకి కేంద్రం తిలోదకాలు వదిలింది. పెట్రోల్‌, డీజిల్‌ పన్నులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే వాటి పన్నుల ధరలు తగ్గుతాయనుకోవడం ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా- కేవలం అత్యాశేనని చెప్పాలి. దేశంలో 2014లో చమురు ఉత్పత్తి 37,788 వేల టన్నులు ఉండగా, 2020 నాటికి 32,172 వేల టన్నులకు తగ్గింది. 2014లో భారత చమురు దిగుమతులు 1,89,425 వేల టన్నులు; 2020 నాటికి అవి 2,26,955 వేల టన్నులకు చేరుకున్నాయి. ఈ జటిల సమస్య నుంచి బయటపడాలంటే దేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని అధికంగా ఉత్పత్తి చెయ్యాలి. రాబోయే కాలంలో విద్యుత్‌ వాహనాల వాడకం పెరిగితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం కావచ్చు. విద్యుత్‌ వాహనాలు భవిష్యత్తులో ప్రాచుర్యం పొందాలంటే వాటి బ్యాటరీల సామర్థ్యాన్ని, కాల పరిమితిని గణనీయంగా పెంచే విధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేసి దీర్ఘకాలిక ప్రణాళికతో చమురు సమస్యకు పరిష్కార మార్గం కనుక్కోవడం అత్యంత ఆవశ్యకం!

సామాన్యుడికి తప్పని భారం

కేంద్ర ప్రభుత్వం 2005-10లో ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థలకు నగదు సబ్సిడీ చెల్లించలేక అందుకు బదులుగా రూ.1.40 లక్షల చమురు బాండ్లను విడుదల చేసింది. ఈ బాండ్ల కాల పరిమితి తీరే నాటికి చెల్లించాల్సిన పైకంలో భాగంగా 2012లో రూ.5,763 కోట్లు, 2015లో రూ.3,500 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేసింది. మిగిలిన రూ.1.31 లక్షల కోట్ల బాండ్లు 2021 అక్టోబరు నుంచి 2026 మార్చి నాటికి దశలవారీగా గరిష్ఠ కాల పరిమితిని చేరుకుంటాయి.

- డాక్టర్‌ బీఎన్‌వీ పార్థసారథి   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని