ఆటోమేటిక్ చెల్లింపులపై ఊరట
రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఊరట కల్పించింది
సెప్టెంబరు 30 వరకు గడువు కల్పించిన ఆర్బీఐ
దిల్లీ: రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది.
ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులకు వినియోగదారుల నుంచి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31 తర్వాత ఏఎఫ్ఏ(అడిషినల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్)కు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్ఆర్బీలు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ గేట్వేలతో పాటు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ గతేడాది డిసెంబరు 4న ఆదేశించింది. కార్డు లావాదేవీల భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ గతంలో తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం రికరింగ్ ఆటోమేటిక్ చెల్లింపుల మొత్తం రూ. 5000 దాటితే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ గేట్వేల చెల్లింపుదారులకు ఓటీపీ పంపి వారి ఆమోదం తీసుకున్నాకే లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ చెల్లింపులను అనుమతించరు. అంతకుముందు రూ. 2000 మించి చేసే అన్ని లావాదేవీలకు దీన్ని పరిమితం చేయాలని ఆర్బీఐ భావించింది. అయితే ఈ పరిమితిని పెంచాలని విజ్ఞప్తులు రావడంతో రూ. 5000 మించిన చెల్లింపులకు ఏఎఫ్ఏ తప్పనిసరి చేసింది.
అయితే కొత్త మార్గదర్శకాలను అమలు చేసేందుకు కొంత సమయం కావాలని బ్యాంకులు, పేమెంట్ గేట్వే సంస్థలు కేంద్ర బ్యాంకును కోరాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ సెప్టెంబరు 30 వరకు గడువు కల్పించింది. అప్పటివరకు ఆటోమేటిక్ చెల్లింపులు యథావిధిగా కొనసాగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.