​​Reliance: రిలయన్స్‌ కొత్త ఇంధన వ్యాపారం

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సౌర, బ్యాటరీలు, ఫ్యూయల్‌ సెల్స్, హైడ్రోజన్‌ వ్యాపారాలపై రాబోయే మూడేళ్లలో రూ.75,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త ఇంధన వ్యాపారం విలువ 36 బిలియన్‌ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు)కు చేరొచ్చని....

Updated : 19 Jul 2021 10:04 IST

విలువ రూ.2.6 లక్షల కోట్లకు

బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ అంచనా

దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సౌర, బ్యాటరీలు, ఫ్యూయల్‌ సెల్స్, హైడ్రోజన్‌ వ్యాపారాలపై రాబోయే మూడేళ్లలో రూ.75,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త ఇంధన వ్యాపారం విలువ 36 బిలియన్‌ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు)కు చేరొచ్చని వాల్‌స్ట్రీట్‌ బ్రోకరేజీ బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం రిలయన్స్‌కు మూడు విభాగాల్లో వ్యాపారాలున్నాయి. చమురు-రసాయనాల (ఓ2సీ) విభాగంలో చమురు రిఫైనరీలు, పెట్రో రసాయనాల ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్‌ వ్యాపారాలున్నాయి. డిజిటల్‌ సేవల్లో టెలికాం సంస్థ జియో ఉంది. రిటైల్‌లో ఇ-కామర్స్‌ కూడా కలిసి ఉంది. కొత్త ఇంధన వ్యాపారం ఇప్పుడు నాలుగో విభాగం (వెర్టికల్‌) కిందకు రానుంది.

* సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ను ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి తీసుకొస్తున్నామని ముకేశ్‌ అంబానీ ప్రకటించడం,  ఓ2సీ వ్యాపారానికి ఎంతో సానుకూల అంశంగా భావిస్తున్నారు. స్వచ్ఛ ఇంధనంపై పెట్టుబడి ప్రణాళికల్ని గమనిస్తే, ఈ వ్యాపార విలువ 36 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోందని బెర్న్‌స్టీన్‌ తెలిపింది. ఓ2సీ వ్యాపార విలువ 69 బిలియన్‌ డాలర్లు, డిజిటల్‌ సేవల వ్యాపార విలువ 66 బి.డాలర్లు, రిటైల్‌ వ్యాపార విలువ 81.2 బి.డాలర్లు ఉంటుందని లెక్కగట్టింది. అప్‌స్ట్రీమ్‌ ఆయిల్, గ్యాస్‌ కార్యకలాపాల విలువ 4.1 బి.డాలర్లు, మీడియా, ఆతిథ్య రంగాల్లోని పెట్టుబడుల విలువ 3.7 బి.డాలర్లతో కలిపి మొత్తం కంపెనీ విలువ 261 బి.డాలర్లకు పైగా (సుమారు రూ.19.57 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.

* చాలా చమురు కంపెనీలు స్వచ్ఛ ఇంధన తయారీ కంపెనీలుగా మారేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ గుర్తు చేసింది. రిలయన్స్‌ స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి నిలిపి మార్జిన్లను పెంచుకుంటే బాగుంటుందని, లేదంటే ఈ సంస్థకు కూడా అధిక రిస్కు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇంధన సెల్స్, బ్యాటరీల తయారీకి అవసరమైన అధునాతన సాంకేతికత  పరిజ్ఞానం ఉండి, తమతో కలిసి పనిచేసే కంపెనీలను రిలయన్స్‌ అన్వేషించాల్సి ఉంది. కొరియా బ్యాటరీ తయారీ సంస్థలు శక్తి నిల్వకు, ప్లగ్, బలార్డ్‌ వంటి కంపెనీలు ఫ్యూయల్‌ సెల్‌ తయారీకి భాగస్వాములుగా ఉండొచ్చని పేర్కొంది.

* రిలయన్స్‌కు ప్రస్తుత బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం, నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని పేర్కొంది. 2021-22లో   రూ.65,600 కోట్ల నగదు నిల్వలు ఉంటాయని, 2025-26 నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరొచ్చని నివేదిక వెల్లడించింది.

గ్రిడ్‌ నుంచి ఇంధనాన్ని నిల్వ చేయడానికి వీలుగా సమ్మిళిత సౌర పీవీ మాడ్యుళ్లు, ఎలక్ట్రోలైజర్లు, ఇంధన సెల్స్, బ్యాటరీలను తయారు చేసే గిగా ఫ్యాక్టరీల నిర్మాణానికి రూ.60,000 కోట్ల పెట్టుబడులను రిలయన్స్‌ పెట్టనుంది. వాల్యూ చైన్, టెక్నాలజీ, కొత్త ఇంధన వ్యాపారం కోసం భాగస్వామ్యాల కోసం మరో రూ.15,000 కోట్లు వ్యయం చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని