Rs 2000 notes: రూ.2వేల నోట్ల ‘చలామణీ’ తగ్గింది..!

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత రెండేళ్లుగా

Updated : 07 Dec 2021 17:27 IST

దిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత రెండేళ్లుగా వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు.. నోట్ల చలామణీని కూడా తగ్గిస్తూ వస్తోంది. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది నవంబరు నాటికి ఆ సంఖ్య 223.3కోట్లకు పడిపోయింది. మొత్తం చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి పరిమాణం కేవలం 1.75శాతం మాత్రమే. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 

‘‘2018 మార్చి 31 నాటికి దేశంలో 336.3కోట్ల రూ.2వేల నోట్లు చలామణీలో ఉన్నాయి. అయితే 2021 నవంబరు 26 నాటికి వాటి సంఖ్య 223.3కోట్లకు తగ్గింది. 2018 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి పరిమాణం 3.27శాతం కాగా.. ఈ ఏడాది నవంబరు నాటికి అది 1.75శాతానికి పడిపోయింది. అలాగే మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల విలువ 37.26శాతం నుంచి 15.11శాతానికి తగ్గింది’’ అని పంకజ్ చౌధరీ పేర్కొన్నారు. 

ప్రజల ద్రవ్య లావాదేవీల డిమాండ్‌కు అనుగుణంగా కరెన్సీ నోట్లను చలామణీలో ఉంచేందుకు ఎంత విలువ గల నోట్లను ముద్రించాలన్న దానిపై రిజర్వ్‌ బ్యాంక్‌తో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన తెలిపారు. 2018-19 తర్వాత నుంచి రూ.2వేల నోట్ల ముద్రణ కోసం కొత్త ప్రతిపాదనేదీ రాలేదని వెల్లడించారు. అందువల్లే ఈ నోట్ల చలామణీ తగ్గినట్లు చెప్పారు. 

నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది. క్రమంగా రూ.500, రూ.200 కొత్త నోట్లను కూడా చలామణీలోకి తెచ్చింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని