సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లే ఎందుకు?

బంగారంపై పెట్టుబ‌డుల‌కు సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలను ఎంచుకోవ‌డం ద్వారా చేకూరే ప్ర‌యోజ‌నాల‌ను ఎస్‌బీఐ వివ‌రించింది.

Updated : 02 Mar 2021 12:55 IST


2020-2021 ఆర్థిక సంవ‌త్స‌రానికి చివ‌రి(12వ విడత) ప‌సిడి మార్చి 1 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ బాండ్లు మార్చి 5 తేది వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.  మ‌దుప‌రులు వారి డీ మ్యాట్ ఖాతాల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. భార‌తీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్ ద్వారా సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలు చేసే వీలుకల్పిస్తుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ-స‌ర్వీస్‌లో ఉన్న ఐఎన్‌బి ఆప్ష‌న్ ద్వారా నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 

ప్ర‌యోజ‌నాలు:
1. ఖ‌చ్చిత‌మైన రాబ‌డి..
సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారు వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీ రేటుతో స్థిర‌మైన రాబ‌డిని పొందవ‌చ్చు. ఈ వ‌డ్డీని ఆరు మాస‌ముల‌కు ఒక‌సారి పెట్టుబ‌డిదారుల ఖాతాలో జమ చేస్తారు. చివ‌రి ఆరు నెలల వ‌డ్డీని మొత్తం పెట్టుబ‌డితో క‌లిపి చెల్లిస్తారు. 

2. నిల్వ చేయ‌న‌వ‌స‌రం లేదు..
భౌతిక రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే, దాన్ని నిల్వ చేయాలి. ఎక్కడ సుర‌క్షితంగా ఉంటుందో చూసుకోవాలి. కానీ ఈ బాండ్లలో అలాంటి ఇబ్బందుకు ఉండ‌వు కాబ‌ట్టి మ‌రింత భ‌ద్రంగా ఉంటాయి. 

3. ద్ర‌వ్యత..
ఆర్‌బీఐ నోటీఫై చేసి, ఇష్యూ చేసిన 15 రోజుల లోపు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడ్ చేయ‌వ‌చ్చు. 

4. జీఎస్‌టీ, త‌చయారీ ఛార్జీలు ఉండ‌వు..
గోల్డ్ కాయిన్‌లు, బార్లు రూపంలో కొనుగోలు చేసే బంగారంపై వ‌ర్తించే జీఎస్‌టీ సార్వభౌమ ప‌సిడి బాండ్ల‌కు వ‌ర్తించ‌దు.  అయితే డిజిట‌ల్ గోల్డ్ కొనుగోళ్ళ‌పై మాత్రం, భౌతిక బంగారం మాదిరిగానే 3 శాతం జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఎస్‌జీబీలో త‌యారీ ఛార్జీలు కూడా ఉండ‌వు. 

5. రుణ స‌దుపాయం..
సావరిన్ బంగారు బాండ్లు పెట్టి రుణాలను తీసుకోవ‌చ్చు. సాధార‌ణ గోల్డ్ లోన్ మాదిరిగానే లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిని ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్ణ‌యిస్తుంది. దీని ప్ర‌కారం బాండ్ల‌ను బ్యాంకు వ‌ద్ద డిపాజిట్ చేసి రుణం తీసుకోవచ్చు. 

6.  మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను..
 మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. ఈ పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గోల్డ్ ఈటీఎఫ్,గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇతర పెట్టుబడులకు అందుబాటులో లేదు.

గోల్డ్ మోనిటైజేష‌న్ స్కీమ్‌లో కింద నవంబ‌రు 2015లో సార్వభౌమ ప‌సిడి ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద భార‌త ప్ర‌భుత్వం త‌రపున రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడ‌త‌ల వారిగా బాండ్ల‌ను జారీ చేస్తుంది. 2021-21కి సంబంధించి 12వ విడత ప‌సిడి బాండ్ల గ్రాము ధ‌ర‌ను రూ.4,662గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఇష్యూధ‌ర‌పై మ‌రో రూ.50 త‌గ్గుతుంది. అంటే ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వారు రూ.4,612 కే గ్రాము విలువైన బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 

ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్ట‌ల్ ద్వారా సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలు చేసే విధానం:
* ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
* ఇ-స‌ర్వీస్ ఆప్ష‌న్‌లో ఉన్న సావ‌రిన్ గోల్డ్ బాండ్‌పై క్లిక్ చేయాలి
* ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ బాక్స్‌లో టిక్ చేసి ప్రాసీడ్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేష‌న్ ఫార‌మ్‌ను పూర్తి చేసి స‌బ్మిట్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే స‌రిపోతుంది. 
గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం. క‌నీసం ఒక గ్రాము నుంచి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు గ‌రిష్టంగా 4 కేజీల వ‌ర‌కు, సంస్థలు 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని