SBI: ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్ స్కీమ్.. మరో వారం మాత్రమే!
ఎస్బీఐ అందిస్తున్న ప్లాటినమ్ డిపాజిట్ స్కీమ్ పరిమిత కాల ఆఫర్తో వస్తుంది. ఈ పథకం ద్వారా డిపాజిటర్లు 15 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని రిటైల్ డిపాజిర్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్స్ పేరుతో స్పెషల్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. మరో వారం రోజుల్లో ఈ స్కీమ్ గడువు ముగియనుంది. దీనిలో 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లను స్వీకరిస్తారు. డిపాజిటర్లు ఈ పథకం ద్వారా 15 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. సెప్టెంబరు 14 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
వడ్డీ రేట్లు ఇలా..
ప్లాటినమ్: 75 రోజులు - 3.95 శాతం
ప్లాటినమ్: 525 రోజులు - 5.10 శాతం
ప్లాటినమ్: 2250 రోజులు - 5.55 శాతం
సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న వడ్డీ రేట్లు..
ప్లాటినమ్: 75 రోజులు - 4.45 శాతం
ప్లాటినమ్: 525 రోజులు - 5.60 శాతం
ప్లాటినమ్: 2250 రోజులు - 6.20 శాతం (ఎస్బీఐ వియ్కేర్ స్కీమ్ కింద వడ్డీ రేటు వర్తిస్తుంది)
అర్హత..
* ఎన్ఆర్ఈ, ఎన్నార్వో టర్మ్ డిపాజిట్లు సహా రూ.2 కోట్ల లోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లను ఎస్బీఐ ప్లాటినమ్ డిపాజిట్ స్కీమ్ కింద అనుమతిస్తారు.
* ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కేవలం 525 రోజులు, 2250 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.
* కొత్త డిపాజిట్స్తో పాటు రెన్యువల్ చేసిన డిపాజిట్స్కి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
* టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్స్కు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
వడ్డీ రేట్లు చెల్లింపు..
* టర్మ్ డిపాజిట్లు - నెలవారీ లేదా త్రైమాసికోసారి చెల్లిస్తారు.
* స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మెచ్యూరిటీ తేదీకి చెల్లిస్తారు.
ఎస్బీఐ ఎఫ్డీ తాజా వడ్డీ రేట్లు..
సాధారణ వినియోగదారులు చేసే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీని ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుంచి అమల్లో ఉన్నాయి.
ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న స్పెషల్ ఎఫ్డీ స్కీమ్..
సీనియర్ సిటిజన్ల కోసం ‘ఎస్బీఐ వియ్కేర్’ పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఎస్బీఐ అందిస్తోంది. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితితో ఈ పథకంలో డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు.. సాధారణంగా వర్తించే వడ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ లభిస్తుంది. సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అదనపు వడ్డీ రేటు అందిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 5 ఏళ్ల ఎఫ్డీపై 5.4 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా, సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.20 శాతం వడ్డీ అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.