ప‌న్ను ఆదాతో పాటు సొంతింటి క‌ల‌ను నేర‌వేర్చుకోండి

డ‌బ్బును స‌మ‌కూర్చుకోవ‌డ‌మే కాకుండా ప‌న్ను ఆదా చేసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం

Updated : 02 Jan 2021 15:01 IST

సొంతింట్లో ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. కాని ఇంటిని కొనుగోలు చేయ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. మొదట ఏ ప్రాంతంలో ఇళ్లు కావాలో నిర్ణ‌యించుకొని, బ‌డ్జెట్ ప్ర‌కారం డౌన్ పేమెంట్ కోసం డ‌బ్బును స‌మ‌కూర్చుకొని, త‌క్కువ వ‌డ్డీ రేటు క‌లిగిన ఇంటి రుణాన్ని తీసుకోవ‌డం వంటివి చాలా ఉంటాయి. ఇవి కాకుండా ప‌న్ను ఆదా చేసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఇది ఆర్థికంగా కొంత ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇంటి రుణంపై చెల్లించే వ‌డ్డీపై రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. రుణం మొత్తం మీద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది. అంటే ఇంటిని రుణంతో కొనుగోలు చేసేవారు ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి మొత్తం రూ.3.5 ల‌క్ష‌ల ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ఇద్ద‌రు ఆదాయం పొందుతున్న భార్య‌భ‌ర్త‌లైతే ఉమ్మ‌డిగా రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. వేత‌నం పొందే భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు 30 శాతం ప‌న్ను శ్లాబులోకి వ‌స్తే రూ.2,10,000 వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు. అయితే రుణం తీసుకున్న ఏడాది నుంచి ఐదేళ్ల‌లోపు ఇంటి నిర్మాణం పూర్త‌యితేనే ఈ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాప‌ర్టీని ఎంచుకుంటే డెవ‌ల‌ప‌ర్ గ‌డువులోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయ‌గ‌ల‌డా లేదా తెలుసుకోవాలి. ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే ఐదేళ్ల‌లోపు పూర్త‌యిన‌ట్లుగా స‌ర్టిఫికెట్ ఉండాలి. నిర్మాణం పూర్త‌యిన ఇంటిని కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండ‌దు.

ఆదాయ ప‌న్ను కాకుండా ప్రాప‌ర్టీపై జీఎస్‌టీ కూడా ప‌డుతుంది. ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం, నిర్మాణంలో ఉన్న ఇంటికి 5 శాతం జీఎస్టీ ప‌డుతుంది. నిర్మాణం పూర్త‌యిన ఇంటిని కొనుగోలు చేస్తే ఆదాయ ప‌న్నుతో పాటు జీఎస్‌టీ కూడా త‌గ్గుతుంది. ప‌న్ను ఆదా చేసుకోవాలంటే సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డం మేలు. దీంతో పాటు మ‌హిళ‌ల‌కు మ‌రింత అద‌న‌పు ప‌న్నుప్ర‌యోజ‌నాలు ఉంటాయి. చాలా రాష్ర్టాలు మ‌హిళ‌ల‌కు గృహ రుణాల‌పై స్టాంప్ డ్యూటి త‌గ్గింపు ప్ర‌క‌టించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని