నేటి నుంచి అందుబాటులోకి 11వ విడ‌త‌  పసిడిబాండ్లు 

డిజిట‌ల్ విధానంలో చెల్లింపులు చేసే వారు రూ.4,862కే ఒక గ్రాము గోల్డ్‌ బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు  

Updated : 01 Feb 2021 11:17 IST


ఆర్ధిక సంవత్సరం 2020-21 కి గాను ప‌ద‌కొండ‌వ విడ‌త‌ సార్వభౌమ పసిడి బాండ్లను నేడు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 5 వరకు ఈ పసిడి బాండ్ల కోసం మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను ఫిబ్ర‌వ‌రి 9,2021న జారీ చేస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ధర గ్రాముకి రూ.4,912 గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుని డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకి రూ.50 డిస్కౌంట్ లభించ‌నుంది. అంటే గ్రాముకి రూ.4,862 గా వర్తించనుంది.

బాండ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పిరియ‌డ్‌కి ముందు వారంలోని చివరి మూడు వ్యాపార రోజులలో ఇండియా బులియన్ అండ్‌ జ్యువెలరీస్ అసోసియేషన్ లిమిటెడ్(ఐబీజేఏ) ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం ధరల సరాసరి విలువ ఆధారంగా పసిడి బాండ్ల ధ‌ర‌ను నిర్ణయిస్తారు. ఈ ద‌శ బాండ్ విలువ‌ను 2021 జ‌న‌వ‌రి 27 నుంచి 29 వ‌ర‌కు ఐబీజేఏ ప్ర‌చురించిన ధ‌ర‌ల‌ స‌రాస‌రి విలువ ఆధారంగా నిర్ణ‌యిచ‌డం జ‌రిగింది

2021 జ‌న‌వ‌రి 11, నుంచి 15 వ‌ర‌కు  విడుద‌ల చేసిన 10వ విడుత ప‌సిడి బాండ్ల ధ‌ర గ్రాముకి రూ.5,104గా ఉంది. క్రితం సారితో పోలిస్తే ఈ సారి విడుద‌ల చేసిన బాండ్ల త‌గ్గింది. సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఇండియా జారీ చేస్తుంది.

బాండ్ల‌ను గ్రాముల ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. ఒక యూనిట్ విలువ ఒక గ్రాము ప‌సిడి విలువ‌కు స‌మానం. ఒక గ్రాము కోసం కూడా స‌బ్‌స్ర్రైబ్ చేసుకోవ‌చ్చు. వ్య‌క్తులు 4 కేజీల గ‌రిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు స‌బ్‌స్క్రైబ్ చేసుకునే అవ‌కాశం ఉంది. ట్ర‌స్టులు, సంస్థ‌లు 20 కేజీల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.
 
సాధార‌ణంగా ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. ఐదవ సంవత్సరం తరువాత ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. విముక్తి ధ‌న అప్ప‌టికి ఉన్న‌ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది.

ఈ సార్వభౌమ పసిడి బాండ్లు బ్యాంకులు(స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల వ‌ద్ద ల‌భించ‌దు) , స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌హెచ్‌సీఐఎల్‌), పోస్ట్ ఆఫీసులు, అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ) ల వద్ద లభిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

సార్వభౌమ పసిడి బాండ్ల పథకం నవంబర్ 2015 లో ప్రారంభమైంది. బంగారం ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో నిల్వ చేసుకోవడాన్ని తగ్గించి బాండ్ల రూపంలో కొనుగోలు చేసేవిధంగా ప్రోత్సహించేందుకు ఈ పథకం చేపట్టారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని