Air India: ఎయిరిండియా కొత్త యజమానిపై హడావుడి.. ఖండించిన ప్రభుత్వం..!
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్ను విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్బెర్గ్ తెలిపింది....
దిల్లీ: ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్ను విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్బెర్గ్ తెలిపింది. కానీ, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఈ బిడ్డింగ్లో టాటా గ్రూపు విజయం సాధించినట్లు వచ్చిన కథనాలు సరికాదని పేర్కొంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు వచ్చిన వార్తలు తప్పు అని పేర్కొంటూ కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి ట్విటర్లో స్పష్టంచేశారు. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఈ అంశంపై టాటా సన్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ఎయిరిండియా సైతం స్పందించలేదు. అయితే, టాటా సన్స్ దాఖలు చేసిన బిడ్ ఆకర్షణీయంగా ఉందని గతకొన్ని రోజులుగా వివిధ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి.
అక్టోబరు 15 (దసరా) నాటికి విజయవంతమైన బిడ్డర్ పేరును ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్నది స్పష్టత రావాల్సి ఉంది. గత నెల 29న ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిరిండియా కోసం చాలా సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. టాటా సన్స్ సహా స్పైస్జెట్ అధిపతి అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్లు సమర్పించారు.
ప్రభుత్వం ఇటీవలే ఎయిరిండియా ‘మినిమం రిజర్వ్ ప్రైస్’ ఖరారు చేసినట్లు గురువారం వార్తలు వెలువడ్డాయి. భవిష్యత్తులో క్యాష్ ఫ్లో అంచనాలు, బ్రాండ్ విలువ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్ల ఆధారంగా రిజర్వ్ ప్రైస్ను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాను దక్కించుకోనే రేసులో టాటాలు ముందు దూకుడుగా ఉన్నారు. అలాగే సంస్థ పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమకూర్చే సత్తా టాటాలకు మాత్రమే ఉందని పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. పైగా వీరికి విమానయాన రంగంలో మంచి అనుభవం కూడా ఉంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో వాటాలు ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎయిరిండియాను ప్రారంభించింది టాటాలే. 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరిట టాటా గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశించింది. 1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఈ బిడ్లు విజయవంతం అయితే.. 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకే వెళ్ల వచ్చు! అంతా సవ్యంగా సాగితే డిసెంబరు నాటికి ఎయిరిండియాలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఎయిరిండియా కొత్త యజమాని చేతుల్లోకి వెళ్లిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!