
E-commerce: ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సీసీఐ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందేనన్న న్యాయస్థానం
దిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కేటాయించింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని భారత్లోని వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిగణనలోకి తీసుకుంది. గతేడాది జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. ఇ-కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీసీఐ విచారణను నిలిపివేయాలన్న సంస్థల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ‘‘అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద సంస్థలు.. దర్యాప్తు, పారదర్శకత వంటి అంశాల్లో స్వచ్ఛందంగా వ్యవహరించాలి. ఇలాంటి విచారణలకు ముందుకు రావాలి. కానీ మీరు దర్యాప్తే జరగకూడదని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో విచారణ జరగాలి. మీరు నివేదికలు సమర్పించాలి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేసింది.