ఉక్కు రుణ భారం తగ్గుతోంది!
దేశంలోని 5 అగ్రగామి ఉక్కు కంపెనీలు రూ.35,000 కోట్ల రుణం (మొత్తం రుణాల్లో 15 శాతాన్ని) తిరిగి చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇది జరగొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది......
5 కంపెనీలు రూ.35000 కోట్లు తిరిగి చెల్లించనున్నాయ్: క్రిసిల్
ముంబయి: దేశంలోని 5 అగ్రగామి ఉక్కు కంపెనీలు రూ.35,000 కోట్ల రుణం (మొత్తం రుణాల్లో 15 శాతాన్ని) తిరిగి చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇది జరగొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఉక్కుకు గిరాకీ పెరగడం, అధిక ధరల నేపథ్యంలో, కంపెనీల నిర్వహణ మార్జిన్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 23 శాతం పెరగనున్నాయని, అందుకే సంస్థలు రుణభారం తగ్గించుకోవడానికి చూస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థికంతో పోలిస్తే మాత్రం 2021-22లో కంపెనీల నిర్వహణ మార్జిన్ 25 శాతం తగ్గే అవకాశం ఉంది. దేశీయ ఉత్పత్తిలో 55 శాతం వాటా కలిగిన టాటా స్టీల్ బీఎస్ఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీల గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో ఇంకా ఏముందంటే..
* 2020-21లో మూలధన వ్యయాలను తాత్కాలికంగా వాయిదా వేయడం వల్ల మిగిలిన సొమ్ముతో కంపెనీలు రుణభారాన్ని తగ్గించుకోనున్నాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశీయ గిరాకీ బలంగా పుంజుకుంది. కరోనా కారణంగా ప్రథమార్థంలో గిరాకీ 30 శాతం క్షీణించగా, 2020 అక్టోబరు నుంచి 2021 జనవరి మధ్య 10 శాతం పెరిగింది.
* మౌలిక రంగంపై అధిక వ్యయాలు, నివాస స్థిరాస్తి విపణి మెరుగుపడటంతో ఉక్కు రంగ గిరాకీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది.
* ఫిబ్రవరిలో హాట్ రోల్డ్ కాయిల్ టన్ను ధర రూ.56,000కు దూసుకెళ్లింది. 2020 మార్చిలో టన్ను ధర రూ.39,200 మాత్రమే అని పేర్కొంది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.