US-China: రూ.1.5 కోట్ల కోట్లపై ఆ నిర్ణయం ప్రభావం!
అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన చైనా కంపెనీలకు ముప్పు తప్పేలా లేదు. యూఎస్ మార్కెట్ల నియంత్రణా సంస్థ ‘సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ)’ గురువారం ఓ కీలక నిబంధనకు ఆమోదం తెలిపింది....
అమెరికా-చైనా ట్రేడ్ వార్లో బలికానున్న 200 కంపెనీలు?
వాషింగ్టన్: అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన చైనా కంపెనీలకు ముప్పు తప్పేలా లేదు. యూఎస్ మార్కెట్ల నియంత్రణా సంస్థ ‘సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ)’ గురువారం ఓ కీలక నిబంధనకు ఆమోదం తెలిపింది. దీంతో చైనా కంపెనీల తనిఖీలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతపరచడంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు ఓ రూపం సంతరించుకున్నట్లైంది.
ఏంటీ నిబంధన...
కొత్త నిబంధన ప్రకారం.. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన విదేశీ కంపెనీలు తమ తనిఖీల(ఆడిట్)కు సంబంధించి అదనపు సమాచారాన్ని వార్షిక నివేదికల్లో బహిర్గతపరచాల్సి ఉంటుంది. అలాగే ఆయా కంపెనీలను తనిఖీ చేసిన ఆడిటర్లు లేదా ఆడిట్ సంస్థలను సమీక్షించేందుకు ‘అమెరికా పబ్లిక్ కంపెనీస్ అకౌంటింగ్ ఓవర్సైట్ బోర్డు(పీసీఏఓబీ)’ని అనుమతించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీలో చైనా ప్రభుత్వానికి ఏమైనా వాటాలున్నాయేమో కూడా తెలియజేయాలి. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఎలాంటి సంబంధాలు నెరిపినా వెల్లడించాలి. లేదంటే ఆయా కంపెనీలు స్టాక్ మార్కెట్ల నుంచి నిష్క్రమించాల్సిందే. చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని అగ్రరాజ్యం ఇప్పటికే నిషేధించింది.
ఎందుకీ నిబంధన...
ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రరాజ్యం నుంచి నిధులు సేకరించి చైనా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. అలాగే చైనా టెక్నాలజీ రంగంలో వస్తున్న గణనీయ వృద్ధిని అమెరికన్ మదుపర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు వర్గాలకు ఈ కొత్త నిబంధన ఓ శరాఘాతం. చైనా ప్రభుత్వ నియంతృత్వ నిబంధనలే ఇందుకు కారణం. పబ్లిక్ కంపెనీలను ఆడిట్ చేసిన సంస్థల పనిని సమీక్షించాలని అమెరికన్ ‘సెర్బేన్స్-ఆక్స్లీ చట్టం-2002’ చెబుతోంది. కానీ, చైనా మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతున్న చైనా కంపెనీలు ఆడిటింగ్ను విదేశాల్లో ఉన్న సంస్థలకు అప్పగిస్తాయి. అయితే, అవి ఏ మేరకు ప్రమాణాలను పాటిస్తున్నాయో సమీక్షించడానికి 2007 నుంచి చైనా మోకాలడ్డుతోంది.
చైనా కంపెనీల విలువ రూ.1.5 కోట్ల కోట్లు...
అమెరికా ఎక్స్ఛేంజీల్లో నమోదవుతున్న చైనా కంపెనీల షేర్ల విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.1.50 కోట్ల కోట్లు). గత దశాబ్ద కాలంలో అమెరికాలో చైనా కంపెనీలు 76 బిలియన్ డాలర్ల నిధుల్ని సమకూర్చుకున్నాయి. ఈ ఒక్క ఏడాదే 37 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. 12.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. మొత్తం 270 కంపెనీలు యూఎస్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాగా కేవలం 14 మాత్రమే ఆడిట్ వివరాలను సమర్పించాయి.
అమెరికా ఆందోళనలకూ కారణం ఉంది...
ఇంత కఠిన నిబంధనలను తీసుకురావడానికి అమెరికా వద్ద కారణాలు లేకపోలేదు. విదేశాల్లో లిస్టయిన కంపెనీలకు సాధారణంగా మంచి పేరుంటుంది. అలాగే వీటికి లిక్విడిటీ కూడా అధికంగానే ఉంటుంది. దీంతో ఆయా కంపెనీలు పటిష్ఠ ఆర్థిక పునాదులున్నట్లుగా కనిపిస్తాయి. దీంతో మదుపర్లు వీటిపై ఆసక్తి కనబరుస్తారు. కానీ, ఒకవేళ ఈ కంపెనీలు తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు తేలితే మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఇది మార్కెట్లకు చాలా ప్రమాదకరం. మే, 2019లో నాస్దాక్లో నమోదైన లకిన్ కాఫీ అనే సంస్థ అదే ఏడాది డిసెంబరులో ఎస్ఈసీకి 180 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించింది. తమ కంపెనీకి 300 మిలియన్ డాలర్ల ఆదాయం ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపించడమే అందుకు కారణం. మరోవైపు చైనాలో ఆడిటర్లకు వారు ఆడిట్ చేస్తున్న సంస్థలే వేతనాలు చెల్లిస్తాయి. ప్రతికూల అంశాలను బహిర్గతం చేయడంపై కంపెనీలు ఏమాత్రం అంగీకరించవని జె క్యాపిటల్ రీసెర్చి డైరెక్టర్ ఆనీ స్టీవెన్సన్ యాంగ్ తెలిపారు. దాదాపు దశాబ్ద కాలంగా చైనా కంపెనీల కార్యకలాపాలు అమెరికాకు అందడం లేదు. దీనిపై ఎస్ఈసీ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ, గత డిసెంబరులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘హోల్డింగ్ ఫారెన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్’ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేసింది.
చైనా ససేమిరా...
మరోవైపు చైనా మాత్రం తమ కంపెనీలు పూర్తి సమాచారాన్ని విదేశీ నియంత్రణా సంస్థలకు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అందుకు అనుగుణంగా జూన్లో ఏకంగా ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కంపెనీ విదేశీ సంస్థలతో సమాచారం పంచుకోవద్దని డేటా సెక్యూరిటీ చట్టం స్పష్టం చేస్తోంది. ఇక ‘దీదీ’ అనే రైడ్ షేరింగ్ సంస్థ అమెరికా స్టాక్స్ ఎక్స్ఛేంజీల నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్న తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా చైనా యోచిస్తోందని తెలుస్తోంది. చైనా కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాకుండా ఏకంగా చట్టమే తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. చివరకు విదేశాల్లో నెలకొల్పి ‘వేరియబుల్ ఇంట్రెస్ట్ ఎంటిటీ’ అనే మార్గాన లిస్టవుతున్న కంపెనీలను కూడా ఈ నిబంధన కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికా సైతం పీసీఏఓబీ నిబంధనలకు కట్టుబడని చైనా సంస్థల ఐపీఓలను అనుమతించొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా కంపెనీలను సాధ్యమైనంత మేరకు తమ నియంత్రణలో ఉంచుకోవాలని అక్కడి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భావిస్తోంది. తొలుత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ప్రయోజనాలు పొందిన డ్రాగన్.. క్రమంగా సంపద తరలిపోతుండడంతో తీరు మార్చింది. చైనాలోనూ డబ్బుందని.. కావాలంటే ఇక్కడే దాన్ని సమకూర్చుకోవాలని కంపెనీలకు పరోక్షంగా హితబోధ చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న పలు కంపెనీలు నలిగిపోయే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం