Financial Freedom: నేటి తరంలో ఆర్థిక స్వేచ్ఛపై అవగాహన మెండు!

స్వాతంత్ర్య సిద్ధించి 74 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై సానుకూల ఆశతో 75వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఆర్థికపరమైన అంశాలపై భారత యువత ఆలోచనాలు ఎలా ఉన్నాయి?...

Published : 14 Aug 2021 14:10 IST

‘గ్రో’ సర్వేలో ఆసక్తికర విషయాలు

దిల్లీ: ‘‘కుర్రాళ్లు బొత్తిగా బరువు బాధ్యతలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.. ముందు వెనకా ఆలోచించకుండా ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు.. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఇళ్లను గుల్ల చేస్తున్నారు..’’ ఇవి సాధారణంగా సినిమాల్లో వయసులో ఉన్న కుర్రాళ్ల గురించి వినిపించే మాటలు. బయట సమాజంలో కూడా దాదాపు ఇదే అభిప్రాయం పాతుకుపోయింది. కానీ, ఇవన్నీ వట్టి అపోహలేనని ఓ సర్వే తేల్చింది. మునుపటి తరంతో పోలిస్తే.. నేటి తరం(మిల్లీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌) వారు తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కుండబద్దలు కొట్టింది. సరైన ఆర్థిక ప్రణాళికతో.. మెరుగైన పెట్టుబడి ప్రణాళికలతో, స్పష్టమైన ఆర్థిక లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..

మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 74 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై సానుకూల ఆశతో 75వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఆర్థికపరమైన అంశాలపై భారత యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆర్థిక స్వేచ్ఛను సాధించడంపై వారి అవగాహనేంటి? వంటి అంశాలపై ప్రముఖ ఆన్‌లైన్‌ పెట్టుబడుల వేదిక ‘గ్రో’ ఓ సర్వే నిర్వహించింది. దీంట్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని గ్రో సీఓఓ హర్ష జైన్ తెలిపారు.

పెట్టుబడులపై ఇప్పటి తరంలో గుణాత్మక మార్పు వచ్చిందని జైన్‌ తెలిపారు. యువత సంపద సృష్టిపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో తేలిందని వెల్లడించారు. పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ అవగాహన పెంచుకుంటున్నట్లు తేలిందన్నారు. 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల 20,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఆగస్టు తొలివారంలో ఈ సర్వే జరిగింది.

సర్వేలోని ఇతర కీలకాంశాలు...


మదుపు ప్రారంభించారు

సర్వేలో పాల్గొన్న వారిలో 79.3 శాతం మంది గత ఏడాది వ్యవధి నుంచే మదుపు చేయడం ప్రారంభించారు. 18.3 శాతం మంది గత మూడేళ్ల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం 2.4 శాతం మంది మాత్రమే మూడేళ్ల క్రితం నుంచి మదుపు చేస్తున్నారు.


కరోనా ముందు నాటి కంటే ఎక్కువే

కరోనా రాకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ మొత్తంలో మదుపు చేయాలని నిర్ణయించుకున్నట్లు 40.2 శాతం మంది తెలిపారు. కరోనా వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం లేదని 26.6 శాతం మంది పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో మదుపు చేయడం కూడా తగ్గించామని 25.8 శాతం మంది తెలిపారు.


నిర్ణయాలపై వీరి ప్రభావమే ఎక్కువ

పెట్టుబడుల నిర్ణయాలను స్నేహితులు లేదా సహచరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు 30.6 శాతం మంది తెలిపారు. ఇక 27.4 శాతం మంది వార్తా సమాచారం నుంచి, 23.4 శాతం మంది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితమవుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి 13.9 శాతం మంది, ఏజెంట్లు, సలహాదారుల దగ్గర నుంచి కేవలం 4.6 శాతం మంది మాత్రమే సలహాలు తీసుకుంటున్నారు.


 మదుపు లక్ష్యం

భవిష్యత్తు ఖర్చులు, రిటైర్‌మెంట్‌ అనంతర జీవితమే లక్ష్యంగా సంపద సృష్టి కోసం మదుపు చేస్తున్నట్లు 59.8 శాతం మంది వెల్లడించడం విశేషం. 30.7 శాతం మంది వ్యక్తిగత లక్ష్యాలతో పాటు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వచ్చే ఖర్చుల కోసం మదుపు చేస్తున్నామని తెలిపారు. 9.5 శాతం మంది పై చదువుల కోసం పెట్టుబడులు పెడుతున్నారు.


ఆర్థిక స్వాతంత్ర్యం అంటే

52.9 శాతం మంది తమతో పాటు తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఆర్థిక స్వేచ్ఛ అని అభిప్రాయపడగా.. 37.3 శాతం మంది మాత్రం తమ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే సామర్థ్యాన్ని సంపాదించడమే ఆర్థిక స్వాతంత్ర్యం అని తెలిపారు. ఇక 10 శాతం మంది.. త్వరగా రిటైర్‌ అయ్యేందుకు సరిపడా సంపదను పోగు చేసుకోవడమే ఆర్థిక స్వేచ్ఛ అని అభిప్రాయపడ్డారు.


అవగాహన లోపమే అసలు కారణం

ఆర్థికపరమైన అంశాలపై అవగాహన లేకపోవడమే తక్కువ మదుపు చేయడానికి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. అలాగే పెట్టుబడుల నిర్ణయాల్లో నష్టభయం తప్పించుకోవడానికి అతిజాగ్రత్త వహించడం కూడా ఓ కారణమని తెలిసింది. అయితే, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై మాత్రం ప్రతిఒక్కరూ సరైన అవగాహన ఏర్పరుచుకుంటున్నారని సర్వే తెలిపింది. తద్వారా భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాల కోసం బాటలు వేసుకుంటున్నారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని