Anand Mahindra: ఎయిరిండియా టేకోవర్‌పై ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే..

ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు....

Updated : 09 Oct 2021 11:29 IST

దిల్లీ: ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు. ఈ విమానయాన సంస్థ నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో భారత్‌లో వ్యాపార వాతావరణం పునర్‌వైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా.. ప్రైవేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని వ్యాఖ్యానించారు.

‘‘ఈ టేకోవర్‌ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్‌వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా టేకోవర్‌ను స్వాగతిస్తూ టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ ఎన్‌ టాటా చేసిన ట్వీట్‌ను ఆనంద్‌ మహీంద్రా తన ట్వీట్‌కు జత చేశారు.

ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లనున్న విషయం తెలిసిందే. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో 100 శాతం వాటా పొందేందుకు రూ.18,000 కోట్లతో టాటాలు దాఖలు చేసిన బిడ్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ) టాలెస్‌ దాఖలు చేసిన బిడ్‌లో రూ.2700 కోట్ల నగదు; రూ.15,300 కోట్ల రుణాల టేకోవరు (మొత్తం రూ.18,000 కోట్లు) ఉన్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే శుక్రవారం వివరించారు. డిసెంబరు కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని