మ్యూచువ‌ల్ ఫండ్ల‌ రాబ‌డిని త‌గ్గించే 4 అంశాలు

మదుపరులు ఏడాది లోపు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా నియంత్రించేందుకు ఒక‌టి శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు..........

Published : 24 Dec 2020 16:16 IST

మదుపరులు ఏడాది లోపు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా నియంత్రించేందుకు ఒక‌టి శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు

ఈక్విటీ మార్కెట్లు స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీని ప్రభావం రాబడి పై ఉంటుంది. అయితే ఈ రాబడి దీనిపైనే కాకుండా ఇతర కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో మదుపు చేసినపుడు రిస్క్, రాబడి తోపాటు ఇతర అంశాలైన వ్య‌య నిష్ప‌త్తి , పోర్టుఫోలియో టర్నోవర్ , ఎగ్జిట్ లోడ్, పన్ను వంటి అంశాలపై కూడా ఉంటుంది.

వ్య‌య నిష్ప‌త్తి:
మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఖర్చులైన ఫండ్ మేనేజ్మెంట్ , పరిపాలన , న్యాయపరమైన, ఆడిటర్, రిజిస్ట్రార్ & ట్రాన్స్‌ఫ‌ర్‌, ఏజెంట్ ఫీజు వంటి వాటిని ఫండ్ మొత్తం విలువ నుంచి తగ్గించిన తరువాత వచ్చిన మొత్తాన్ని నికర ఆస్తి విలువగా పరిగణిస్తారు. ఇది రోజువారీ నిరంతర ప్రక్రియ.

అయితే ఈ ఖర్చులను మదుపుదారుడు విడిగా చెల్లించడు కాబట్టి, పట్టించుకోడు. దీనివలన దీర్ఘకాలంలో అంటే 10 ఏళ్లలో చేసిన పెట్టుబడిఫై , వ్య‌య నిష్ప‌త్తి లో 1 శాతం తేడా వలన, వచ్చిన రాబడిపై 6 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది.

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ , మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిర్వహించే ఆస్తుల విలువను బట్టి ఖర్చులపై పరిమితిని విధించింది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు మార్కెట్ల హెచ్చుతగ్గుల సమయంలోకూడా అధిక రాబడి ని ఇవ్వడం ద్వారా, వాటి అధిక నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అయితే ఉన్నవాటిలో తక్కువ నిర్వహణ ఖర్చులు గల పథకాలనే తమ వినియోగ‌దారుల‌కు సూచిస్తున్నట్లు ‘ఇంటర్నేషనల్ మనీ
మార్కెట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్’ వ్య‌వ‌స్థాప‌కుడు లోవైయ్ నవలఖి తెలిపారు.

పోర్టుఫోలియో టర్నోవర్ :
ఒక ఏడాది కాలంలో పోర్ట్ఫోలియో లో ఉన్న స్టాక్స్ మార్చడాన్నే పోర్టుఫోలియో టర్నోవర్ అంటారు. ఇది ఫండ్ లో ఎంత శాతం ఉందో తెలియజేస్తుంది. ఇది ఫండ్ వ్యూహం ప్రకారం ఎక్కువ లేదా తక్కువ గా ఉండొచ్చు. అధిక పోర్టుఫోలియో టర్నోవర్ వలన బ్రోకరేజ్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్ష‌న్ పన్ను వంటి వాటివలన ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే దీనివలన అధిక రాబడి ఉండొచ్చు , ఉండక పోవచ్చు.

ఎగ్జిట్ లోడ్:
మదుపరులు ఏడాది లోపు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా నివారించేందుకు 1 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇది రాబడి ఫై ప్రభావం చూపుతుంది. ఈక్విటీలు దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే మంచి రాబడిని అందిస్తాయి. అయితే అనుకోని పరిస్థితులలో సొమ్ము అవసరమై , వేరొక మార్గం లేకపోతె తప్ప, ఏడాది లోపు ఫండ్ నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిది.

పన్ను:
పన్ను మినహాయింపు తరువాత వచ్చేదే నికర రాబడి. ఏడాది లోపు ఈక్విటీ యూనిట్స్ అమ్మగా వచ్చిన రాబడి ని స్వల్పకాలిక మూల ధన రాబడిగా గుర్తించి 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తరువాత అమ్మగా వచ్చిన రాబడిని దీర్ఘకాలిక మూలధన రాబడిగా గుర్తించి, రూ 1 లక్షకి మించిన రాబడి ఫై 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫై వచ్చే డివిడెండ్ ఫై 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను వర్తిస్తుంది. అందువలన నెలసరి ఆదాయం కోసం డివిడెండ్ కన్నా క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్) మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని