సిబిల్ స్కోర్ పడిపోయిందా.. కొత్త రుణం ఎలా?

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో చిన్న చిన్న లోపాల కారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువ అవుతుంది.

Published : 12 May 2021 13:53 IST

1. నమస్తే ఈనాడు, నేను ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. నా నెలసరి జీతం రూ. 26,000. నా దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉండేవి, నేను పని చేసే కంపనీ లో సరైన సమయానికి సాలరి పడక నా క్రెడిట్ కార్డ్ బిల్లు సమయానికి చెల్లించలేక పోవడం తో సిబిల్ స్కోర్ పడిపోయింది. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసాను, ఎలాంటి లోన్స్ లేవు ఇప్పుడు. ఇప్పుడు మల్లీ సిబిల్ స్కోర్ పెరగడం ఎలా. త్వరలో ఇంటి లోన్ తీసుకుందాము అనుకుంటున్నాను.
- రాఘవేంద్ర
A. ఇంటి రుణం కోసం మంచి క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. క్రెడిట్ స్కోర్ను మరింతగా మెరుగుపరుచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
దరఖాస్తు చేయగానే రుణం రావడం అంత సులభం కాదు. రుణ దరఖాస్తును బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రస్తుతం క్రెడిట్బ్యూరోల వద్ద అందరి రుణ చరిత్ర ఉంటోంది. అందులో ఇంతకుముందు ఆ వ్యక్తి చేసిన రుణ దరఖాస్తులు, రుణ చెల్లింపుల్లో తప్పులు వంటివి ఉంటాయి. దాని ఆధారంగానే బ్యాంకులు ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి తెలియకుండానే రుణ చరిత్ర మీద ఊహించని చెడు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఒక క్రమ పద్ధతిలో రుణ చరిత్ర నివేదికను మార్చుకోవడం, క్రెడిట్ స్కోర్ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

ఒక్కోసారి రుణ సంస్థలు అప్పు మొత్తం తీర్చేసిన తర్వాత కూడా దాని గురించి క్రెడిట్ బ్యూరోకు సమాచారం అందించి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని రుణ చరిత్ర నివేదికలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ విషయాన్ని రుణ సంస్థ ద్వారా క్రెడిట్ బ్యూరోకు చెప్పించి అప్డేట్ చేయించాలి. ఇంకా వేరే ఎవరో ఖాతాను మన నివేదికతో అనుసంధానించి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్ బ్యూరోకు అన్ని ఆధారాలు అందజేసి మీ నివేదికలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా బిల్లులను సకాలంలో చెల్లించడంలో జాప్యం జరగొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో చిన్న చిన్న లోపాల కారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువ అవుతుంది. అందువల్ల తప్పదు అనుకుంటే ఒకటే క్రెడిట్ కార్డు వాడాలి. బిల్లు చెల్లింపులను గడువుతేదీలోపు చెల్లించాలి.
క్రెడిట్ స్కోర్ సరిగా ఉండదని భావించేవారు దాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుని చెల్లించేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చని ఎవరో తెలియనవారు సలహా ఇవ్వవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే. మీ సంపాదన, ఆర్థిక సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా బ్యాంకులు రుణం ఇవ్వడం గురించి ఆలోచిస్తాయి. అందులో క్రెడిట్ స్కోర్ కేవలం ఒక అంశం మాత్రమే. అందుకే అనవసరంగా రుణం తీసుకోకపోవడమే మంచిది.
మీకు ప్రాముఖ్యత తెలియని కారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో చెల్లించకుండా ఉండిపోయిన క్రెడిట్ కార్డు బిల్లులను , ఈఎమ్ఐలను వీలైనంత తొందరగా చెల్లించేయాలి. చెల్లింపు గడువులోపే భవిష్యత్తు ఈఎమ్ఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కోసారి గడువులోపు రుణం చెల్లించనందువల్ల మీ క్రెడిట్స్కోర్ పై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొత్త రుణాలను తీసుకోకపోవడం మంచిది. ప్రస్తుత బాకీలను తీర్చడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.

2. సర్, పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ళ కాల పరిమితి ముగిసాక దాన్ని కొనసాగించాలా లేక డబ్బు వెనక్కి తీసుకోవాలా? సలహా ఇవ్వగలరు.
- కొల్లిపర సుందరయ్య
A. పీపీఎఫ్ ఖాతా ద్వారా మంచి రాబడి తో పాటు సెక్ష 80C ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీన్ని 5 ఏళ్ళ చొప్పున కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే, ఖాతాని మరి 5 లేదా 10 ఏళ్ళ పాటు కొనసాగించవచ్చు. 

60 ఏళ్ళు పైబడిన వారైతే పోస్ట్ ఆఫీస్ పెద్దల పొదుపు పధకం (SCSS) లో కూడా మదుపు చేయవచ్చు. దీని వడ్డీ పీపీఎఫ్ తో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉంటుంది.

3. హలో సిరి, నేను సుమారుగా రూ. 22 లక్షల వరకు లార్జ్ కాప్, మిడ్ కాప్, టాక్స్ సేవర్, డెట్  ఫండ్స్ లో డిస్ట్రిబ్యూటర్ వెబ్సైటు ద్వారా మదుపు చేశాను. దీని వల్ల నాకు ఎంత నష్టం ఉంటుంది?
- కే.ఏ రెడ్డి
A. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా  ఆఫ్లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. ఇది ఫండ్ ని బట్టి 1-2 శాతం వరకు ఉండొచ్చు. 
 
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మీరు మీ ఫండ్స్ ని డైరెక్ట్ ప్లన్స్ లోకి మార్చుకోవచ్చు. ముందుగా యూనిట్స్ అమ్మేసి, ఈ డైరెక్ట్ ప్లాన్ లో తిరిగి మదుపు చేయండి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని