సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌లో ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు? 

ఈ ప‌థ‌కంలో వ‌డ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.4 శాతం  

Updated : 22 Jun 2021 11:38 IST

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) అనేది ప్ర‌భుత్వ హామీతో  ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న ప‌థ‌కం.  పెద్ద‌లు ఈ ప‌థ‌కంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ‌బ్బు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా గానీ, ఉమ్మ‌డిగా గానీ ఖాత‌ను తెరిచే వీలుంది. అంతేకాకుండా పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌తో క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌చ్చు. 

ఈ ప‌థ‌కంలో ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు..
1. భార‌తీయ‌ నివాసితులైన సీనియ‌ర్ సిటిజ‌న్లు( 60 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు) ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. 
2. 55 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే వారు స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కం (వాలెంట‌రీ రిటైర్‌మెంట్ స్కీమ్- వీఆర్ఎస్‌) కింద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసివుండాలి. 
3. దేశ ర‌క్ష‌ణాద‌శంలో ప‌నిచేసి ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన 50 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన వారు, 60 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి కూడా ఈ ప‌థ‌కంలో చేరేందుకు అర్హుత ఉంటుంది. 
4. హిందూ అవిభాజ్య కుటుంబాల వారు, ఎన్ఆర్ఐలను ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అనుమ‌తించ‌రు. 

ఇత‌ర ముఖ్య విష‌యాలు..
* భార‌త్‌లోని ఏదైనా అధీకృత బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను తెర‌వ‌చ్చు.  ఖాతా తెరిచిన‌ప్పుడు క‌నీసం రూ. 1000 నుంచి గ‌రిష్టంగారూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒకేసారి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ ఖాతాను దేశ‌వ్యాప్తంగా బ‌దిలీ చేసుకునే సౌక‌ర్యం ఉంది. 
* ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల కాల‌ప‌రిమితి వ‌ర్తిస్తుంది. మ‌రో మూడేళ్లు పొడిగించుకోవ‌చ్చు.
* సీనియ‌ర్ సిటిజ‌న్ల పెట్టుబ‌డులకు భ‌ద్ర‌త ఉంటుంది..
* ఇందులో పెట్టుబ‌డి పెట్టిన సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌చ్చు. 
* ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.4 శాతం
* ఈ ప‌థ‌కంలో వ‌డ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రం.. ఏప్రిల్‌, జూలై, అక్టోబ‌రు, జ‌న‌వ‌రి నెల‌ల్లో మొద‌టి తేదిన వ‌డ్డీ ఖాతాల‌లో జ‌మ‌వుతుంది. 
* ముంద‌స్తు విత్‌డ్రాల‌పై పెనాల్టీ ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం త‌రువాత ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. జ‌రిమానా డిపాజిట్ మొత్తంపై 1 నుంచి 1.5 శాతం మ‌ధ్య‌ ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని