
Unemployment: భారత్లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు..!
దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా సంస్థలు నష్టాలతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. 2021 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి.
ఇందులో 3.5కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండగా.. 1.7కోట్ల మంది మాత్రం జాబ్ చేయాలని ఉన్నా అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని సీఎంఐఈ తన నివేదికలో పేర్కొంది. ఇక ఉద్యోగ వేటలో ఉన్న వారిలో 23శాతం మంది (80లక్షల మంది) మహిళలు అని తెలిపింది. జాబ్ చేయాలని ఉన్నా.. అందుకు సరైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నవారిలో 53శాతం మంది (90 లక్షల మంది) మహిళలే అని వెల్లడించింది.
‘‘ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం అవకాశాలు లేకపోవడం. చాలా చోట్ల కంపెనీలు మహిళలంటే వెనక్కి తగ్గుతున్నాయి. ఇక ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు సామాజికంగానూ ఎలాంటి సహకారం అందడం లేదు’’ అని సీఎంఐఈ నివేదిక పేర్కొంది.