Bangalore: బెంగళూరులో డబుల్‌ బెడ్‌రూం అద్దె రూ.50,000!

Bangalore: బెంగళూరులో ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో ఎక్కువ భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికలు పేర్కొన్నాయి.

Updated : 04 Apr 2023 12:52 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు గణనీయంగా పెరిగాయి. 2022 ఆరంభంతో పోలిస్తే దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా మారింది.

‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికలు పేర్కొన్నాయి. గూగుల్‌, అమెజాన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, యాక్సెంచర్‌.. వంటి బడా సంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా. కొవిడ్‌ సమయంలో వీరందరికీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ సదుపాయం కల్పించడంతో సొంతూళ్లకు వెళ్లారు. ఫలితంగా ఇళ్ల అద్దెలు గణనీయంగా పడిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. తిరిగి ఉద్యోగులంతా నగరానికి చేరుకున్నారు. దీంతో మళ్లీ అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. పైగా కొవిడ్‌ సమయంలో వాటిల్లిన నష్టాల్ని యజమానులు ఇప్పుడు పూడ్చుకుంటున్నారు.

బెంగళూరులో ఇప్పుడు ‘రెంటల్‌ మార్కెట్‌’కు మంచి డిమాండ్‌ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అయినట్లు తెలిపారు. దీన్ని అదనుగా చేసుకొని యజమానులు గతంలో నష్టాల్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఫలితంగా అద్దెలు దాదాపు రెండింతలైనట్లు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు.

ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవలే అమెరికాలో ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేసుకొని వచ్చిన ఓ వ్యక్తి.. ఇళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ‘‘చాలా మంది గూగుల్‌ ఇంటర్వ్యూ కష్టమంటుంటారు.. కానీ, బెంగళూరులో ఇళ్లు దొరకడం అంతకంటే కష్టంగా ఉంది’’ అని చెప్పడం గమనార్హం. డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో కొత్త ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ అన్‌జెన్‌ స్పేసెస్‌ యజమాని అర్పన్‌ బత్రా తెలిపారు. గత త్రైమాసికంలో కేవలం 13,650 కొత్త రెసిడెన్షియల్‌ యూనిట్లు మాత్రమే నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు.

రమ్యఖ్‌ జైన్‌ అనే వ్యక్తి ఫిబ్రవరిలో ఉద్యోగరీత్యా దిల్లీ నుంచి బెంగళూరుకు మారారు. డబుల్‌ బెడ్‌రూం ఇంటిని నెలకు రూ.50,000 అద్దెతో తీసుకున్నట్లు తెలిపారు. దిల్లీతో పోలిస్తే ఇది దాదాపు ఒకటిన్నర రెట్లు అధికమని వెల్లడించారు. పైగా ఇంటి పరిమాణం కూడా దిల్లీలో తామున్న దానితో పోలిస్తే సగమేనని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని