Gautam Adani: 2028వరకు కీలక వ్యాపారాల విభజన: అదానీ గ్రూప్‌

Gautam Adani: అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలోని కీలక వ్యాపారాలు ఇప్పటికీ ఆ గ్రూప్‌ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కిందే ఉన్నాయి. వాటి విభజనను 2028 వరకు పూర్తిచేస్తామని అదానీ గ్రూప్‌ వెల్లడించింది.

Updated : 22 Jan 2023 15:35 IST

దిల్లీ: భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group) నిర్వహణలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని ప్రధాన సంస్థ అయిన ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL)’ కిందే కొనసాగుతున్నాయి. వాటిలో హైడ్రోజన్‌, విమానాశ్రయాలు, డేటా సెంటర్ల వ్యాపారాలు ప్రధానమైనవి. వీటిని 2025- 2028 మధ్య ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేస్తామని ‘చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి (CFO)’ జుగేషిందర్‌ సింగ్‌ తెలిపారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (AEL) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) కోసం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇటీవలే దరఖాస్తు సమర్పించింది. ఎఫ్‌పీఓ (FPO)ను జనవరి 27న ప్రారంభించి జనవరి 31న పూర్తి చేయనున్నారు. ఎఫ్‌పీఓ (FPO)లో ఒక్కో షేరును రూ.3,112- 3,276 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు. ప్రస్తుతం నమోదిత సంస్థలుగా మారిన నౌకాశ్రయాలు, విద్యుత్తు, సిటీ గ్యాస్‌ వ్యాపారాలు కూడా ఒకప్పుడు ఏఈఎల్‌ (AEL) కింద ఉన్నవే. హైడ్రోజన్‌, విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్‌, డేటా సెంటర్లు, రోడ్లు- లాజిస్టిక్స్‌ మాత్రం ఇంకా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (AEL) ఆధ్వర్యంలోనే ఉన్నాయి. హైడ్రోజన్‌ వ్యాపారంలో వచ్చే 10 ఏళ్లలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూప్‌ సిద్ధమైన విషయం తెలిసిందే.

కనీస పెట్టుబడుల విలువను చేరుకున్న తర్వాత ఆయా వ్యాపారాలను విభజించి ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేస్తామని జుగేషిందర్‌ తెలిపారు. విభజనకు కావాల్సిన కనీస అనుభవం కూడా ఈ విభాగాలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ స్థితి 2025- 2028 మధ్య ఈ వ్యాపారాలు అందుకునే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణహితమైన ఉదజని ఇంధనాన్ని అత్యంత చౌక ధరకు అందించాలని అదానీ గ్రూప్‌ (Adani Group) లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయ సేవల నిర్వహణ సంస్థగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది.

మరింత మంది రిటైల్‌ మదుపర్లకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా కంపెనీలో వాటాదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఎఫ్‌పీఓ (FPO)కు వస్తున్నామని జుగేషిందర్‌ తెలిపారు. రైట్స్‌ ఇష్యూకి బదులుగా ప్రైమరీ ఆఫర్‌కు వెళ్లడానికి కూడా అదే కారణమన్నారు. ఈ ఎఫ్‌పీఓ (FPO)లో సమీకరించిన నిధులతో హరిత ఉదజని, విమానాశ్రయాల్లో వసతులు, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. కొంత భాగాన్ని రుణం తీర్చడానికి వినియోగించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని