Gautham Adani: ఆసియా కుబేరుడు అదానీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు....
నికర సంపదలో ముకేశ్ అంబానీని దాటేసిన గౌతమ్
ఇంటర్నెట్ డెస్క్: ఆసియాలో అత్యధిక సంపద కలిగిన కుబేరుడు ఎవరంటే టక్కున ముకేశ్ అంబానీ అని సమాధానం చెబుతారు! గత 14 ఏళ్లుగా ఆయన ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో అందరూ ఆయన పేరునే గుర్తు పెట్టేసుకున్నారు. కానీ, ఇప్పుడు సమాధానం మారింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రియల్టైం బిలియనీర్స్ జాబితాల ప్రకారం.. ఇప్పుడు సంపదలో అంబానీ కంటే అదానీ ముందున్నారు. అయితే, వీరివురి సంపదల మధ్య స్వల్ప తేడానే ఉండడంతో ఈ స్థానాలు రోజుల వ్యవధిలోనే తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతత్ అదానీ 88.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. అంబానీ 87.9 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ రియల్టైం బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం చూస్తే అదానీ 91.2 బిలియన్ డాలర్లలో పదో స్థానంలో, 89.3 బిలియన్ డాలర్లతో అంబానీ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. వ్యక్తుల రోజువారీ సంపదను లెక్కించేందుకు బ్లూమ్బర్గ్, ఫోర్బ్స్ వేర్వేరు పద్ధతుల్ని అనుసరిస్తాయి. అందుకే రెండు జాబితాల ప్రకారం సంపద విలువలో స్వల్ప తేడాలుంటాయి.
2021లో ఎంతో మార్పు..
14 ఏళ్లుగా భారత్లో అత్యంత ధనవంతుడిగా అంబానీ కొనసాగుతున్నారు. మధ్యలో ముకేశ్ను ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ వెనక్కి నెట్టినా.. ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. ఇక జాబితాలో మిగతా వారితో పోలిస్తే అంబానీ చాలా ముందుండేవారు. బహుశా సమీప భవిష్యత్తులో అంబానీని అధిగమించేవారు లేకపోవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ, 2021లో పరిస్థితులు మారిపోయాయి.
మహమ్మారి సంక్షోభంతో యావత్తు ప్రపంచం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, అదానీ సంపద మాత్రం రాకెట్లా దూసుకెళ్లింది. ఈయన గతేడాది రోజుకు రూ.1000 కోట్లకు పైగా ఆర్జించారని హురున్ నివేదిక తెలిపింది. దీంతో ఏడాది వ్యవధిలో సంపద విలువ 261 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు చేరగా, ఆయన ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన కంపెనీలు 5 ఉన్నట్లు హురున్ పేర్కొంది. కేవలం తొమ్మిది నెలల్లో అదానీ నికర సంపద రెండింతలైనట్లు ఫోర్బ్స్ తెలిపింది. జనవరి ఆరంభం నుంచి ఈ కుబేరుడి సంపద 8.68 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు పేర్కొంది. దుబాయ్లో ఉన్న అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం సైతం వ్యాపారంలో రాణిస్తోంది.
మరోవైపు ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే అంబానీ సంపద రెండు బిలియన్ డాలర్ల మేర కుంగింది. పైగా 2021లో అంబానీ సంపదలో పెద్దగా ఎదుగుదల కనిపించలేదు. అలాగే ఫ్యూచర్ గ్రూప్, సౌదీ ఆరామ్కోతో ఒప్పందాలు నిలిచిపోవడంతో రిలయన్స్ షేర్లలో ర్యాలీ కూడా పడిపోయింది.
భవిష్యత్తులో పోటీ తప్పదా?
కమొడిటీ రంగంలో వ్యాపారం ప్రారంభించిన అదానీ క్రమంగా ఇతర రంగాలకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. పోర్ట్స్లోనైతే ప్రస్తుతం ఆయన ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగుతోంది. హరిత ఇంధనం, విమానాశ్రయాలు, గనులు, విద్యుత్తు కేంద్రాలు ఇలా అనేక రంగాల్లోకి ఆయన వ్యాపారాలు విస్తరించాయి. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ఆయన సంపద వృద్ధికి భారీ తోడ్పాటునందించింది. 2021లో ఈ కంపెనీ షేరు దాదాపు రెండింతలైంది. గత బుధవారం ఒక్కరోజు కంపెనీ షేరు 13.9 శాతం ర్యాలీ కావడం గమనార్హం. అదానీ గ్రూప్లోని ఇతర కంపెనీలు సైతం భారీ ఎత్తున లాభపడ్డాయి. దీంతో సంపదలో అదానీ.. అంబానీ దగ్గరకు చేరుకున్నారు. మార్చి 30, 2014న 5.10 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద విలువ ఫిబ్రవరి 08, 2022 నాటికి 88.5 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. అదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద 21.8 బిలియన్ డాలర్ల నుంచి 87.9 బి.డాలర్లకు చేరింది.
ఇరు కంపెనీలు భారీ విస్తరణ ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించేశాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ విషయంలో రెండు సంస్థలూ భవిష్యత్తులో పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉభయ కంపెనీల మధ్య ఎక్కడా ప్రత్యక్ష పోటీ లేదు. వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంబానీ ప్రకటించగా.. అదే రంగంలో రానున్న దశాబ్ద కాలంలో 30 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు అదానీ వెల్లడించారు. సౌర విద్యుత్తు, హరిత ఉదజని విషయంలో అంబానీ భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అదానీ ఇప్పటికే సోలార్ ఎనర్జీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్టులు, పోర్టులు, ఎఫ్ఎంసీజీ రంగాల్లోనూ అదానీ తనదైన ముద్ర వేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.