Air India: జనవరి 27న టాటాల చేతుల్లోకి ఎయిరిండియా..!

ఎయిరిండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది. ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఈ వారాంతం

Published : 24 Jan 2022 16:46 IST

దిల్లీ: ఎయిరిండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది. ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఈ వారాంతం నాటికి టాటా గ్రూప్‌నకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. జనవరి 27న ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుందని తెలుస్తోంది. 

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు రూ.18,000 కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ దాఖలు చేసిన బిడ్‌కు గతేడాది అక్టోబరు 8న కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే నెల 11న ఈ బిడ్డింగ్‌ను ధ్రువీకరిస్తూ కేంద్రం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేసింది. అక్టోబరు 25న, ఈ ఒప్పందానికి సంబంధించిన షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)పై ప్రభుత్వం సంతకం చేసింది. ఇక మిగతా ప్రక్రియ కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే ఈ వారాంతం నాటికి ఎయిరిండియాను పూర్తిగా టాటాల చేతుల్లో పెట్టనున్నట్లు తెలిపాయి. 

అటు ఎయిరిండియా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వినోద్‌ హెజ్మాది కూడా ఇదే విషయాన్ని సంస్థ సిబ్బందికి ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. జనవరి 27 నుంచి ఎయిరిండియా నిర్వహణ టాటాలు అందుకోనున్నట్లు ఆయన తన మెయిల్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 

ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలను అందించే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం; ఐఏఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం కూడా టాటా గ్రూప్‌నకు దక్కనుంది. ఎయిరిండియా రాకతో టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోకి  మూడో విమానయాన బ్రాండ్‌ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఎయిరిండియా నిర్వహణ బాధ్యతలు వచ్చిన తర్వాత ఎయిరేషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.
ఈ ఒప్పందంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ పూర్తిగా టాటా గ్రూప్‌ అధీనంలోకి వెళ్లనుంది. 89ఏళ్ల కిందట 1932లో జేఆర్‌డీ టాటా.. టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ దీన్ని స్థాపించారు. ఆ తర్వాత ఎయిరిండియాగా మారింది. అయితే 1953లో దీన్ని జాతీయకరణ చేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. కాగా.. ప్రైవేటు సంస్థలను విమానయానంలోకి అనుమతించాక ఎయిరిండియా క్రమంగా తన ప్రభ కోల్పోసాగింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం సంస్థకు నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ బాటపట్టింది. ఈ క్రమంలో ఎయిరిండియాను తిరిగి టాటాలు దక్కించుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని