Air India: బిగ్‌డీల్‌: 250 విమానాలకు ఎయిరిండియా ఆర్డర్‌

Air India- Airbus deal: ఎయిరిండియా పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలను కొనుగోలు చేయనుంది.

Published : 14 Feb 2023 18:22 IST

దిల్లీ: విమానయాన చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందం జరిగింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ (Airbus) నుంచి పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు టాటాలకు చెందిన ఎయిరిండియా (Air India) ఆర్డర్‌ పెట్టింది. 40 వైడ్‌ బాడీ విమానాలు సహా మొత్తం 250 విమానాలను ఎయిర్‌బస్‌ నుంచి కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌, రతన్‌ టాటా, చంద్రశేఖరన్‌, కేంద్రమంత్రులు పీయూశ్‌ గోయల్‌, జ్యోతిరాధిత్య సింథియా, ఎయిర్‌బస్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 
250 విమానాల్లో 40 వైడ్‌ బాడీ కలిగిన ఏ350 విమానాలను, మిగిలిన 210 నారో బాడీ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. వైడ్‌ బాడీ విమానాలను 16 గంటలకు పైగా ప్రయాణాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వరంగానికి చెందిన ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్‌.. మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 250 విమానాలను ఎయిర్‌బస్‌కు తాజాగా ఆర్డర్‌ పెట్టింది. మిగిలిన విమానాలను బోయింగ్‌ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 17 ఏళ్ల తర్వాత ఎయిరిండియా చేపట్టిన తొలి ఆర్డర్‌ కాగా... ఎయిరిండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ చేపట్టిన తొలి ఆర్డర్‌ కూడా ఇదే కావడం గమనార్హం. 17 ఏళ్ల క్రితం బోయింగ్‌ నుంచి 68, ఎయిర్‌ బస్‌ నుంచి 43 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది.

మన బంధం బలోపేతం: మోదీ 

ఎయిరిండియా- ఎయిర్‌బస్‌ మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఒప్పందం కారణంగా భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. పౌర విమానయాన రంగంలో మరింత వృద్ధి చెందాలన్న భారత ఆకాంక్షలను చేరుకోవడంలోనూ ఈ డీల్‌ ఉపయోగపడనుందన్నారు. గడిచిన 8 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147కి పెరిగిందన్నారు. ఉడాన్‌ స్కీమ్‌ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం విమాన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసిందని చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో భారత్‌కు దాదాపు 2,000 విమానాలు అవసరం ఉంటుందన్నారు. భారత్‌- ఫ్రాన్స్‌ స్నేహపూర్వక బంధానికి ఈ ఒప్పందం మరో మైలురాయి అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని