Airtel: మరో షాక్‌కు ఎయిర్‌టెల్‌ సిద్ధం.. ఈ ఏడాదీ టారిఫ్‌ పెంపు!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ మరోషాక్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది కూడా టెలికాం ఛార్జీల పెంపు ఉండొచ్చని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గోపాల్‌ విట్టల్‌ తెలిపారు.

Published : 10 Feb 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ మరో షాక్‌కు సిద్ధమైంది. ఈ ఏడాదీ ఎయిర్‌టెల్‌ టెలికాం ఛార్జీల పెంపు ఉండొచ్చని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. అలాగే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలియజేశారు.

2022లో మరోసారి ఛార్జీల పెంపు ఉండొచ్చని.. రాబోయే 3-4 నెలల్లో ఈ పెంపు ఉండే అవకాశం ఉందని గోపాల్‌ తెలిపారు. అయితే, ఈ నిర్ణయం చందాదారుల వృద్ధి, పోటీతత్వంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.163గా ఉండగా,  ఈ ఏడాది రూ.200కు చేరుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.

ఎయిర్‌టెల్‌ గతేడాది నవంబర్‌లో 20 శాతం మేర ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అక్కడికి కొద్ది రోజులకే వొడాఫోన్‌, జియో సైతం ఈ దారిలో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మూడో త్రైమాసికంలో ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున చందాదారులను కోల్పోయాయి. ఎయిర్‌టెల్‌ ఒక్కటే 6 లక్షల మందిని చేజార్చుకుంది.

ఈ ఏడాది 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మే-జూన్‌ మధ్య స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం గురించి గోపాల్‌ విఠల్‌ మాట్లాడారు. స్పెక్ట్రమ్‌ రిజర్వ్‌ ధర తక్కువగా ఉండాలని, చెల్లింపుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు చేపడుతోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని