Akshaya Tritiya Offers: అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆభరణాల కోనుగోలుపై రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు

Akshaya Tritiya Offers: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆభరణాల సంస్థలు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి.

Updated : 21 Apr 2023 12:28 IST

Akshaya Tritiya Offers | ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందువులు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని ఐశ్వర్యాలకు అధినేత్రిగా పూజిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటూ ఉండదని అంటుంటారు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) పర్వదినాన బంగారం కొనుగోలు చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆభరణాల సంస్థలు ఇప్పటికే ఆఫర్ల (Akshaya Tritiya offers)ను ప్రకటించాయి. వాటిలో కొన్ని..

జీఆర్‌టీ జ్యువెలర్స్‌ (GRT Jewellers): బంగారు ఆభరణాల తరుగుపై 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాల విలువపై 10 శాతం, వెండి వస్తువుల తయారీ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. బంగారు నాణేలపై తరుగు లేదని ప్రకటించింది. ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులు రక్షణ పొందేందుకు ఆభరణాలను ముందుగా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపింది. అక్షయ తృతీయ రోజు ధర తగ్గితే వ్యత్యాసం తిరిగి ఇస్తామని జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ఎండీ జి.ఆర్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు.

లలితా జ్యువెలర్స్‌: అన్ని బంగారు నగలకు తరుగులో ఒక శాతం తగ్గింపునిస్తోంది. అన్ని వజ్రాభరణాలకు క్యారెట్‌లో రూ.2,000 వరకు తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. అలాగే బంగారు నాణేలపై ఎటువంటి తరుగును తీయబోమని లలితా జ్యువెలర్స్‌ ప్రకటించింది.

ఫోన్‌పే: తమ యాప్‌ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారాన్ని కొనుగోలు చేసేవారికి ఉచిత స్టోరేజ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. అలాగే ఎలాంటి మేకింగ్‌ ఛార్జీలు కూడా ఉండవని ప్రకటించింది. కస్టమర్‌ తరఫున విక్రేతలే బ్యాంక్ గ్రేడ్‌ ఇన్సూర్డ్‌ లాకర్‌లో భద్రపరుస్తారని తెలిపింది. దీన్ని కస్టమర్లు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చని పేర్కొంది. డబ్బును 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది. 1 గ్రాము కంటే ఎక్కువ బంగారాన్ని అక్షయ తృతీయ (ఏప్రిల్‌ 22న) రోజు కొనుగోలు చేసినవారికి రూ.50 నుంచి రూ.500 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని వెల్లడించింది.

జోయలుక్కాస్ (Joyalukkas): రూ.10 వేల కంటే ఎక్కువ విలువ చేసే వెండి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి రూ.500 విలువ చేసే గిఫ్ట్‌ వోచర్‌ లభిస్తుంది. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలు కొంటే రూ.1,000 గిఫ్ట్‌ వోచర్‌ లభిస్తుంది. అలాగే వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, అరుదైన ఆభరణాల కొనుగోలు విలువ రూ.50 వేలు దాటితే రూ.2,000 గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ కూడా లభిస్తుంది. అయితే, కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ రూ.30,000 దాటాలి. ఈ ఆఫర్లు ఏప్రిల్‌ 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

తనిష్క్ (Tanishq): బంగారం, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ముందుగానే బుక్‌ చేసుకునేవారికి గోల్డ్‌ రేట్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. మరోవైపు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కనీసం రూ.80 వేల కొనుగోళ్లు చేసేవారికి రూ.4,000 తక్షణ రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్లు ఏప్రిల్‌ 23 వరకు అందుబాటులో ఉన్నాయి.

కల్యాణ్ జ్యువెలర్స్‌ (Kalyan Jewellers): కొనుగోలు మొత్తంలో సగం విలువ చేసే ఆభరణాలపై సున్నా శాతం మాత్రమే తయారీ ఛార్జీలు ఉంటాయి. అయితే, కనీసం రూ.1 లక్ష విలువ చేసే ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మలబార్ గోల్డ్ (Malabar Gold): రూ.30,000 విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారికి ఉచితంగా 100 మిల్లీగ్రాముల బంగారు నాణేన్ని అందిస్తున్నారు. ఒకవేళ రూ.30,000 విలువైన డైమండ్, ఇతర విలువైన ఆభరణాలను కొంటే 250 మి.గ్రా బంగారు నాణేలను సంస్థ అందజేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.

క్యారట్‌లేన్ (Caratlane): అన్ని డిజైన్ల వజ్రాభరణాలపై 20 శాతం వరకు తగ్గింపును క్యారట్‌లేన్ అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేసేవారికి అదనంగా 5 శాతం రాయితీ కూడా ఇస్తోంది.

పీసీ జ్యువెలర్స్ (PC Jewellers): బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50 శాతం తగ్గింపునిస్తోంది.

(గమనిక: పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఆఫర్లపై ఆయా కంపెనీల రిటైల్‌ స్టోర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ఆఫర్లను పొందేందుకు ఉండే షరతులపై స్పష్టత వస్తుంది)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు