Remittance: విదేశాలకు డబ్బు పంపుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
డాలర్ విలువ భారీగా పెరిగింది. దీంతో విదేశాలకు డబ్బులు పంపేవారికి ఖర్చు అధికమైంది. మరి తక్కువ వ్యయంతో డబ్బులు పంపడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: విద్య, వైద్యం, విహారయాత్రల కోసం భారతీయులు పెద్దఎత్తున విదేశాలకు డబ్బు పంపుతుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నాయని అంచనా. ఇది ఏటా 20 శాతం చొప్పున పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. మే నెలలో ఓ దశలో రూ.77.73 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇది విదేశాలకు డబ్బు పంపేవారిపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా అలాంటి వారంతా తక్కువ ఖర్చుతో సేవలందించే సంస్థలను ఆశ్రయించాల్సిన అనివార్యత ఏర్పడింది.
నియమాలు తెలుసుకోండి..
‘లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (LRS)’ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల డాలర్లు విదేశాలకు పంపొచ్చు. మైనర్లు సహా ఎవరైనా విదేశాలకు డబ్బు పంపడానికి అర్హులే. కరెంట్ లేదా క్యాపిటల్.. అవసరమైతే రెండు రకాల ఖాతాల్లోకి డబ్బు పంపొచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్యం కోసం సాధారణంగా ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు పంపుతుంటారు. అయితే, ఈ రెండు అంశాల్లో 2.50 లక్షల డాలర్ల కంటే ఎక్కువ పంపేందుకు కూడా అనుమతి ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
మూడు మార్గాలు..
విదేశాలకు డబ్బు పంపడానికి మూడు మార్గాలు ఉన్నాయి. బ్యాంకులు; థామస్ కుక్, వెస్టర్న్ యూనియన్, ముథూట్ ఫిన్కార్ప్ వంటి బ్యాంకింగేతర సంస్థలు (NBFC); వైస్యాప్, బుక్మైఫారెక్స్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా డబ్బు పంపొచ్చు. వీటిలో ఏదైనా సంస్థను ఎంచుకునేటప్పుడు విశ్వసనీయత, ఖర్చు, ఎక్స్ఛేంజ్ రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత మొత్తం, ఎన్నిసార్లు పంపుతున్నారో కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
విశ్వసనీయతలో బ్యాంకులు ముందు..
వైర్ ట్రాన్స్ఫర్, నెట్బ్యాంకింగ్, ఫారెన్ కరెన్సీ చెక్స్, డీడీల ద్వారా బ్యాంకులు డబ్బును విదేశాలకు పంపేందుకు అనుమతిస్తాయి. విదేశాల్లోని అనుబంధ బ్యాంకుల ద్వారా బ్యాంకులు ఈ డబ్బును అక్కడికి బదిలీ చేస్తుంటాయి. దీంతో విశ్వసనీయత, భద్రత విషయంలో బ్యాంకులు మేలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దమొత్తంలో డబ్బులు పంపాల్సి వస్తే మాత్రం బ్యాంకులే ఉత్తమమని చెబుతున్నారు. దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి రెమిటెన్స్ వసతిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. పైగా బ్యాంకుల్లో అయితే, కేవైసీ సమస్యలు కూడా ఉండవని సూచిస్తున్నారు.
ఖర్చును తగ్గించుకోండి..
విదేశాలకు డబ్బు పంపడం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. మొత్తం మూడు రకాల ఖర్చులుంటాయి. అవి బదిలీ రుసుము, ఎక్స్ఛేంజ్ రేటు, ఫారెక్స్ రేటుపై మార్క్-అప్. విశ్వసనీయతలో బ్యాంకులు ముందున్నప్పటికీ.. ఖర్చు విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల్లో మరింత ఎక్కువ వ్యయం అవుతుంది. బ్యాంకులు సాధారణంగా ఎక్స్ఛేంజ్ రేటుపై 1-2 శాతం మార్క్-అప్ను వసూలు చేస్తాయి. ఎన్బీఎఫ్సీల్లో మనం పంపబోయే దేశాన్ని బట్టి ఖర్చులు మారుతూ ఉంటాయి. కొన్ని సంస్థలు నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి.
బుక్మైఫారెక్స్ వంటి సంస్థలు ఎక్స్ఛేంజ్ రేటును ముందుగానే నిర్ణయించుకుని మారకపు విలువ ఆ స్థాయికి రాగానే డబ్బులు బదిలీ అయ్యే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. గరిష్ఠంగా మూడు రోజుల వరకు ఎక్స్ఛేంజ్ రేటును ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ రేటు వద్ద అయితే పంపాలనుకుంటున్నారో.. ఆ రేటుకు రాగానే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి డబ్బులు బదిలీ అయిపోతాయి. కొన్ని సంస్థలైతే రియల్టైం ఎక్స్ఛేంజ్ రేటును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎలాంటి మార్క్-అప్ ఫీజులు వసూలు చేయవు. అందుకోసం బిడ్-ఆస్క్ ప్రైస్ మధ్య ఉండే మిడ్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ రేటును పరిగణనలోకి తీసుకుంటారు. మనకు సముచిత రేటు లభిస్తుందో.. లేదో.. మనమే తెలుసుకోవచ్చు. మీరు ఏ కరెన్సీలోకైతే డబ్బులను పంపుతున్నారో.. వాటి మధ్య మారకపు విలువను ఆల్లైన్లో ఇంటర్బ్యాంక్ రేట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అది.. మీకు బ్యాంకులు అందించిన ఎక్స్ఛేంజ్ రేటుతో సరిపోలిందో.. లేదో.. ఇట్టే తెలిసిసోతుంది. కొన్ని ఎన్బీఎఫ్సీలు ఒక రోజు వ్యవధిలో డబ్బులు బదిలీ అవుతాయని హామీ ఇస్తున్నాయి. సాధారణంగా 48-76 గంటలు పట్టొచ్చని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
ఎక్స్ఛేంజ్ రేటుపై కన్నేసి ఉంచండి..
తరచూ విదేశాలకు డబ్బు పంపాల్సిన అవసరం ఉన్నవాళ్లు ఎక్స్ఛేంజ్ రేటుపై ఓ కన్నేసి ఉంచాలి. తక్కువ ఉన్నప్పుడే తొందరపడితే చాలా డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు ఎక్స్ఛేంజ్ రేటు తక్కువ ఉన్నప్పుడే పంపితే ప్రయోజనం ఉంటుంది. మరోవైపు రెమిటెన్స్కు సంబంధించిన పత్రాలు నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఫెమా చట్టం కింద చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అలాగే మీరు ఎంత డబ్బు పంపాలనుకుంటున్నారో దానికి ఛార్జీలను అదనంగా జతచేయాలి. లేదంటే మనం పంపే సొమ్ము నుంచే సంస్థలు రుసుములకు కట్ చేసుకుంటే అందాల్సిన మొత్తం అందక అవతలివారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..