Auto Expo: 700KM రేంజ్‌తో బీవైడీ కారు.. మారుతీ ఈవీ కాన్సెప్ట్‌ ఇదే.. ఆటోఎక్స్‌పో విశేషాలు..!

Auto Expo: మూడేళ్ల విరామం తర్వాత నోయిడాలో ఆటోక్‌ఎక్స్‌పో ప్రారంభమైంది. ఇందులో అనేక కంపెనీ తమ సరికొత్త వాహన మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి.

Published : 11 Jan 2023 18:10 IST

దిల్లీ: ప్రతిష్ఠాత్మక వాహన ప్రదర్శన (Auto Expo 2023) మూడేళ్ల విరామం తర్వాత బుధవారం ప్రారంభమైంది. గ్రేటర్‌ నోయిడాలో ఏర్పాటు చేసిన ఈ వాహన ప్రదర్శన (Auto Expo 2023)లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, కియా ఇండియా, ఎంజీ మోటార్‌, జేబీఎం ఆటో, గ్రీవ్స్‌ కాటన్‌ సహా పలు ప్రముఖ వాహన తయారీ కంపెనీలు తమ మోడళ్లను ప్రదర్శించాయి.

ఈవీఎక్స్‌తో విద్యుత్తు వాహనాల్లోకి మారుతీ..

మారుతీ సుజుకీ (Maruti Suzuki)ఇండియా ఈరోజు ఆటో ఎక్స్‌పో (Auto Expo 2023)లో తమ విద్యుత్తు ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ ఈవీఎక్స్‌ (eVX)ను ఆవిష్కరించింది. ఈ మిడ్‌- సైజ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని సుజుకీ మోటార్ కార్పొరేషన్‌ (SMC) అభివృద్ధి చేసింది. ఇది 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 550 కి.మీ వరకు ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. 2025 నాటికి దీన్ని మార్క్‌ట్‌లోకి తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని ఎస్‌ఎంసీ అధ్యక్షుడు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఈవీఎక్స్‌తో పాటు మారుతీ సుజుకీ వేగనార్‌ ఫ్లెక్స్‌ ఫ్యుయెల్‌ ప్రొటోటైప్‌, బ్రెజా ఎస్‌-సీఎన్‌జీ, గ్రాండ్‌ విటారా ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ సహా మొత్తం 16 వాహనాలను ఈ ప్రదర్శనలో ఉంచింది.

గ్రీవ్స్‌ కాటన్‌ నుంచి మూడు..

ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ గ్రీవ్స్‌ కాటన్ (Greaves Cotton) పలు విద్యుత్తు వాహనాలను తాజా వాహన ప్రదర్శనలో ఉంచింది. యాంపియర్‌ (Ampere) బ్రాండ్‌తో యాంపియర్‌ ప్రైమస్‌, యాంపియర్‌ ఎన్‌ఎక్స్‌జీతో పాటు డెలివరీలకు సైతం ఉపయోగించగలిగే యాంపియర్‌ ఎన్‌ఎక్స్‌యూను ఈ ఆటోఎక్స్‌పోలో ఆవిష్కరించింది. వాణిజ్య త్రిచక్రవాహన విభాగంలో ‘గ్రీవ్స్‌ ఈఎల్‌పీ’ అనే విద్యుత్తు ప్రయాణ వాహనం, ‘గ్రీవ్స్‌ ఈఎల్‌సీ’ అనే కార్గో ఈవీ, ఫ్యూచరిస్టిక్‌ కార్గో కాన్సెప్ట్‌ ‘గ్రీవ్స్‌ ఏరో విజన్‌’ను గ్రీవ్స్‌ కాటన్‌ ప్రదర్శించింది. యాంపియర్‌ ప్రైమస్‌ ఈ త్రైమాసికంలోనే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. మిగిలిన వాహనాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని పేర్కొంది.

ఎంజీ హెక్టార్‌ @ రూ.14.72 లక్షలు..

ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఆటోఎక్స్‌పోలో తమ తర్వాతి తరం హెక్టార్‌ (MG Hector) వాహన ధరలను ప్రకటించింది. స్టైల్‌, స్మార్ట్‌, స్మార్ట్‌ ప్రో, షార్ప్‌ ప్రో, సావీ ప్రో అనే ఐదు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. వీటి ధర రూ.14.72- 22.22 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉండనుంది. ఐదు, ఆరు, ఏడు సీట్ల సామర్థ్యంతో ఈ వాహనాన్ని తీసుకొస్తున్నారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ హెచ్‌డీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి. ‘డ్రైవ్‌ ఎహీడ్‌’ పేరిట తమ భవిష్యత్తు మొబిలిటీ ప్రణాళికలను కూడా ఎంజీ మోటార్‌ ఆవిష్కరించింది. తయారీకి సిద్ధంగా ఉన్న మొత్తం 14 వాహనాలను ఈ కంపెనీ ఈ ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది.

జేబీఎం గెలాక్సీ స్కూల్‌ బస్సు..

జేబీఎం ఆటో సొంతంగా రూపొందించి తయారు చేసిన విలాసవంతమైన విద్యుత్తు కోచ్‌ ‘గెలాక్సీ’ (JBM Galaxy)ని ప్రదర్శించింది. 12 మీటర్ల పొడవాటి ఈ కోచ్‌ 45 సీట్ల సామర్థ్యంతో వస్తోంది. దీని ధరను మాత్రం వెల్లడించలేదు. సిటీ బస్‌, స్టాఫ్‌ బస్‌, స్కూల్‌ బస్‌ వంటి ఈ-బస్సులను కూడా షోలో ఉంచింది.

రూ.44.95 లక్షలతో హ్యుందాయ్‌ అయోనిక్‌5

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విద్యుత్తు మోడల్‌ అయోనిక్‌5 (Hyundai Ioniq 5)ని విడుదల చేసింది. దీని ధర రూ.44.95 లక్షలు (ఎక్స్‌షోరూం). దీన్ని కంపెనీకి మాత్రమే ప్రత్యేకమైన ఇ-జీఎంపీ ప్లాట్‌ఫారంపై నిర్మించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే ఈ కారు 631 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

700కి.మీ రేంజ్‌తో బీవైడీ..

చైనాకు చెందిన బీవైడీ ఇండియా తమ విద్యుత్తు కారును ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. బీవైడీ సీల్‌ (BYD Seal) పేరిట తీసుకొస్తున్న ఈ కారును 2023 చివరి త్రైమాసికంలో విడుదల చేస్తామని పేర్కొంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 700 కి.మీ వరకు ప్రయాణిస్తుందని తెలిపింది. అలాగే ఈ సందర్భంగా ATTO 3 అనే కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 34.49 లక్షలు (ఎక్స్‌షోరూం). కేవలం 1200 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. డీలర్ల నెట్‌వర్క్‌ను సైతం రెండింతలకు పెంచుకోనున్నట్లు ప్రకటించింది.

అతుల్‌ మొబిలీ..

అతుల్‌ ఆటో రెండు విద్యుత్తు త్రిచక్ర వాహనాలను విడుదల చేసింది. మొబిలీ (Atul Mobili) అనే ప్యాసెంజర్ వెహికల్‌తో పాటు ఎనర్జీ (Energie) అనే కార్గో వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండింటి ధరల్ని మాత్రం వెల్లడించలేదు. మొబిలీకి 110 కి.మీ, ఎనర్జీకి 195 కి.మీ రేంజ్‌ ఉన్నట్లు తెలిపింది.

కియా ఈవీ9, కేఏ4..

కియా ఇండియా (KIA India) ఈవీ9, కేఏ4 అనే విద్యుత్తు కాన్పెప్ట్‌ కార్లను ఈ ప్రదర్శనలో పరిచయం చేసింది. మరోవైపు వచ్చే నాలుగేళ్లలో విద్యుత్తు వాహన విభాగంలో రూ.2,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

రెండేళ్లకోసారి నిర్వహించే వాహన ప్రదర్శన వాస్తవానికి 2022లో జరగాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణాలతో ఈ ఏడాదికి వాయిదా పడింది. కొత్తగా పుట్టుకొచ్చిన అంకుర సంస్థలు, ముఖ్యంగా విద్యుత్‌ వాహన విభాగ కంపెనీలు ఈ ప్రదర్శనలో అధిక స్థాయిలో పాల్గొంటున్నాయి. 46 వాహన తయారీ సంస్థలతో పాటు సుమారు 80 సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం అవుతున్నాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది. 2020 వాహన ప్రదర్శనతో పోలిస్తే ఈసారి అధిక కంపెనీలు వాహన ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయని వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు