Bank Locker: బ్యాంకు లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించండి.. ఎందుకంటే?

డిసెంబరు 31, 2022 నాటికి బ్యాంకులో లాకర్‌ ఉన్నవాళ్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సందేశాలు పంపుతున్నాయి. సమీక్షించిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

Updated : 28 Dec 2022 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరం సమీపించడంతో బ్యాంకులు తమ లాకర్‌ (Bank Locker) కస్టమర్లకు సందేశాలు పంపుతున్నాయి. వెంటనే తమ లాకర్‌ (Bank Locker) ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలన్నది ఆ సందేశాల సారాంశం. 2022 డిసెంబరు 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే ఈ సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నాయి.

ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులకు లాకర్‌ నిబంధనలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. వాస్తవానికి 2022 ఆరంభంలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లాకర్‌ సదుపాయం తీసుకున్న కస్టమర్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

కొత్త మార్గదర్శకాల తర్వాత లాకర్‌ నిబంధనలిలా..

బ్యాంకులు లాకర్‌ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదు. అలాగని బ్యాంకు ప్రయోజనాలను దెబ్బతీసేంత ఉదారంగా కూడా నిబంధనలు ఉండొద్దు.

లాకర్‌ కేటాయించడానికి ముందు కస్టమర్‌, బ్యాంకు మధ్య కచ్చితంగా ఒప్పంద పత్రం ఉండాలి. స్టాంప్‌ పేపర్‌పై నియమ నిబంధనలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దీనికి సంబంధించిన ఓ నకలు పత్రాన్ని కస్టమర్‌కు ఇవ్వాలి. తద్వారా లాకర్‌ తీసుకున్నవారికి వారి హక్కులు, బాధ్యతలు తెలుస్తాయి.

‘ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (IBA)’ రూపొందించిన ప్రామాణిక ముసాయిదా ప్రకారం ఒప్పందం ఉండేలా బ్యాంకులు చూసుకోవాలి. కొత్త నిబంధనలతో పాటు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఒప్పంద పత్రం ఉండాలి.

ఒకవేళ బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల దొంగతనం, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం.. వంటి ప్రమాదం సంభవించి లాకర్‌లోని వస్తువులు లేదా నగదు పోతే.. వినియోగదారుడు చెల్లించిన లాకర్‌ రుసుముకు 100 రెట్ల మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకులు లాకర్‌ గదుల్లో కచ్చితంగా సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. అలాగే సీసీటీవీ డేటాను 180 రోజుల వరకు నిక్షిప్తం చేసి ఉంచాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

కస్టమర్లు తమ లాకర్‌ని తెరిచినప్పుడల్లా బ్యాంకులు వారికి ఎసెమ్మెస్‌, ఇ-మెయిల్‌ రూపంలో సందేశం పంపాలి. తద్వారా ఎలాంటి మోసాలకు తావుండదు.

కొత్తగా లాకర్‌ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దెతో పాటు ఇతర ఛార్జీలకు సమానమైన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయమని బ్యాంకులు కోరవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఇప్పటికే లాకర్‌ ఉన్నవాళ్లు, ఖాతాల నిర్వహణలో క్రమశిక్షణతో ఉన్న కస్టమర్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఒకవేళ లాకర్‌ తీసుకున్న కస్టమర్‌ మరణిస్తే.. నామినీకి లాకర్‌లోని వస్తువులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. అయితే, కచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని