ఆర్థిక ప్రణాళికకు ఉత్తమమైన పెట్టుబడి మార్గాలు..

మ‌న జీవితంలో సాధించ‌వ‌ల‌సిన ఆర్థిక ల‌క్ష్యాల‌ను దృష్టిలో ఉంచుకుని దానికి త‌గ్గ‌ట్లుగా పెట్టుబ‌డులు, పొదుపు చేస్తూ ఉండాలి.....

Published : 19 Dec 2020 16:20 IST

మ‌న జీవితంలో సాధించ‌వ‌ల‌సిన ఆర్థిక ల‌క్ష్యాల‌ను దృష్టిలో ఉంచుకుని దానికి త‌గ్గ‌ట్లుగా పెట్టుబ‌డులు, పొదుపు చేస్తూ ఉండాలి.

వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌తో పాటు, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌నూ ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని పెట్టుబడి చేయాలి. మ‌న దేశంలో చాలా మంది ప్ర‌జ‌లు ఆర్థిక ప్ర‌ణాళికను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డులు పెడుతున్నామంటే, ప్ర‌స్తుత అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను విస్మరించమని కాదు. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఎప్ప‌టికైనా ప్రమాదమే. కావున మ‌న జీవితంలో సాధించ‌వ‌ల‌సిన ఆర్థిక ల‌క్ష్యాల‌ను దృష్టిలో ఉంచుకుని దానికి త‌గ్గ‌ట్లుగా పెట్టుబ‌డులు, పొదుపు చేస్తూ ఉండాలి.

ఎలాంటి ప్రమాదం లేని ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలను మీకోసం కింద తెలియచేశాము.

ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌) :

ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌ర జీవితం సాఫీగా సాగేలా ఈపీఎఫ్‌, పీపీఎఫ్ తోడ్ప‌డ‌తాయి. ఇవి అత్యంత భ‌ద్ర‌త‌తో కూడిన‌వే కాకుండా, మంచి రాబ‌డులను కూడా అందిస్తాయి. పీపీఎఫ్‌ 7.90 శాతం, ఈపీఎఫ్‌ 8.65 శాతం రాబడులతోపాటు వార్షిక వ‌డ్డీ ఆదాయాన్ని కూడా అందిస్తాయి. ఉద్యోగి చిన్న వ‌య‌సు నుంచే పెట్టుబ‌డులు పెట్టినట్లయితే, ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి పెద్ద మొత్తంలో నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. వ‌డ్డీ ఆదాయమే కాకుండా, ఈపీఎఫ్‌లో మెచ్యూరిటీ స‌మ‌యంలో మీ పెట్టుబ‌డుల‌లో మ‌రింత వృద్ధి నెల‌కొంటుంది.

ప్రజా భ‌విష్య‌నిధి (పీపీఎఫ్‌) :

పీపీఎఫ్‌లో చాలా త‌క్కువ ఆదాయం గ‌ల వారు సైతం రూ.100 మొద‌లుకుని పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. పీపీఎఫ్‌లో ఖాతాను ఏదేనీ బ్యాంకు లేదా పోస్ట‌పాఫీసు శాఖ‌ల‌లో తెర‌వ‌వ‌చ్చు.

పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ ప‌థ‌కాలు :

ఈపీఎఫ్‌, పీపీఎఫ్ లాగానే పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్లు(పీఓటీడీ) సైతం క‌చ్చిత‌మైన హామీతో, న‌ష్ట‌భ‌యం అంత‌గా లేని రాబ‌డులు(6.90 నుంచి 7.70 శాతం) అందిస్తాయి. ఈ ప‌థ‌కం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని భార‌త త‌పాలా సేవ‌ల విభాగం నేతృత్వంలో అమ‌లవుతోంది. ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితులు త‌ట్టుకుని, న‌ష్ట‌భ‌యం అంత‌గా లేని రాబ‌డుల‌నందించ‌డంలో ఇవి ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గం. ఇందులో రూ.200 నుంచి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. లాకింగ్ పీరియ‌డ్ 1 నుంచి 5 ఏళ్లు. పీఓటీడీలు మంచి ప‌న్ను ఆదా ప‌థ‌కాలు కూడా. ఇందులో మ‌రో ముఖ్య‌మైన అంశ‌మేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖాతాను వేరే శాఖ‌కు మార్చుకునే సౌల‌భ్యం ఉంది. ఇందులో బ‌హుళ వ్య‌క్తులు, ఉమ్మ‌డి ఖాతాను కూడా తెర‌వ‌వ‌చ్చు.

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం :

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌) అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప‌థ‌కం. ఇది ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కం. దీని నిర్వ‌హ‌ణ చాలా సుల‌భ‌మే గాక‌, త‌క్కువ ఖ‌ర్చు, ప‌న్ను ఆదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేసుకునే స‌దుపాయాలున్నాయి. ఎన్‌పీఎస్ ముఖ్యంగా అసంఘ‌టిత రంగంలో ప‌ని చేస్తున్న‌వారికి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని స‌మ‌కూర్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఎన్‌పీఎస్ నిధిలో ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి 40 శాతం మొత్తానికి ప‌న్నులు వ‌ర్తించ‌వు, అలాగే ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం అద‌నంగా రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలున్నాయి.

మ్యూచువ‌ల్ ఫండ్లు :

మొద‌టి సారిగా పెట్టుబ‌డులు పెట్టేవారికి లేదా పెట్టుబడుల విష‌యంలో అంత‌గా ప‌రిజ్ఞానం లేని వారికి, మ్యూచువ‌ల్ ఫండ్లు మంచివి. ఇందులో ఏ వ‌య‌సు వారైనా త‌మ త‌మ ఆర్థిక ల‌క్ష్యాలు, పెట్టుబ‌డుల‌క‌నుగుణంగా క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం(సిప్)లో చేయ‌వ‌చ్చు. సాంప్ర‌దాయ ఆర్థిక సాధానాల‌లో వ‌లె ఇందులో లాకింగ్ పీరియ‌డ్ లేక‌పోవ‌డం ప్ర‌ధాన సానుకూల‌త‌. మ‌దుప‌రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ‌బ్బుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఇందులో వృత్తిగ‌త నిర్వ‌హ‌ణ‌, పెట్టుబ‌డుల వైవిధ్య‌త‌, న‌గ‌దు ల‌భ్య‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌, త‌క్కువ ఖ‌ర్చు లాంటివి ఇత‌ర సానుకూల అంశాలు. స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెడితే మంచి రాబ‌డుల‌ను అందుకోవ‌చ్చు.

చివరగా :

వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక అనేది ప్ర‌తీ ఒక్క‌రికి అత్యంత ముఖ్య‌మైన అంశం, కావున దీనిని ఎవ‌రూ విస్మ‌రించ‌కూడ‌దు. మంచి భ‌విష్య‌త్ కోసం ఇప్ప‌టి నుంచే పెట్టుబ‌డుల‌ను పెడుతూ ఉండాలి. అలాకాకుంటే వ్య‌క్తుల‌తో పాటు, వారి కుటుంబ‌మూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని