Credit Suisse: 1 బిలియన్‌ డాలర్లకు క్రెడిట్‌ సూయిజ్‌ కొనుగోలు!

స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)ను 1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌ (UBS) గ్రూప్‌ ఏజీ ముందుకొచ్చినట్లు సమాచారం.

Published : 20 Mar 2023 00:55 IST

ఇంటర్నెట్‌డెస్క్: దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ను 1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం మార్కెట్‌ ముగిసేనాటికి క్రెడిట్‌ సూయిజ్‌ మార్కెట్‌ విలువ 8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే, దీనిని 1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌ నిర్ణయించినట్లు సమాచారం. మరీ తక్కువ ధర నిర్ణయించడం పట్ల అటు షేర్‌ హోల్డర్లు, ఇటు ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశముంది. ఒక్కో షేర్‌కు 0.25 స్విస్‌ ఫ్రాంక్‌లు చెల్లించాలని యూబీఎస్‌ నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. అయితే, చెల్లింపులు 100 బేస్‌ పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా యూబీఎస్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతికూల ప్రభావంతో శుక్రవారం మార్కెట్‌ ముగిసే నాటికి షేర్‌ విలువ 8శాతం క్షీణించి 1.86 ఫ్రాంక్‌లకు చేరుకుంది.

క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) సంస్థ ఆర్థికంగా బలహీనంగా ఉందనే విషయం బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. దీంతో స్విస్‌ ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్‌, స్విస్‌ ఫైనాన్సియల్‌ మార్కెట్‌ సూపర్‌వైజరీ అథారిటీ (ఫిన్మా) రంగంలోకి దిగి సంస్థను ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటవేయడానికి యత్నాలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంక్‌ స్విస్‌ విభాగాన్ని వేరుచేయడం, యూబీఎస్‌తో డీల్‌ కుదర్చడం వంటి అంశాలపై దృష్టిపెట్టాయి. క్రెడిట్‌ సూయిజ్‌లో ప్రధాన వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌ కుదైరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెగ్యులేటరీ ఇబ్బందుల కారణంగా క్రెడిట్‌ సూయిజ్‌లో పెట్టుబడి పెట్టబోమని పేర్కొన్నారు. దీంతో క్రెడిట్‌ సూయిజ్‌ స్టాక్‌ ధర పతనమైంది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ షేరు 85 శాతం మేర కుంగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని