Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజి మిస్త్రీ (93) నిన్న అర్ధ రాత్రి ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు  కంపెనీ అధికారులు వెల్లడించారు.

Updated : 28 Jun 2022 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ (93) నిన్న అర్ధ రాత్రి ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు  కంపెనీ అధికారులు వెల్లడించారు. మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు షాపూర్జీ ప్రస్తుతం గ్రూపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు సైరస్‌ మిస్త్రీ గతంలో టాటాసన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక కుమార్తెలు లీలా, ఆలూ ఉన్నారు. వీరిలో ఆలూ ప్రముఖ పారిశ్రామిక వేత్త నోయల్‌ టాటా భార్య. పల్లోంజీ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగాను 2016లో ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్‌ అంచనాల ప్రకారం ఆయన సంపద విలువ రూ.2.2 లక్షల కోట్లు. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో 125వ స్థానంలో నిలిచారు. 2021లో ఆయన భారత్‌లోని సంపన్నుల్లో తొమ్మిదో స్థానం దక్కించుకొన్నారు.  

షాపూర్జీ పల్లోంజి గ్రూపు ప్రధానంగా ఇంజినీరింగ్‌, నిర్మాణం,ఇన్ఫ్రా,రియల్‌ ఎస్టేట్‌, వాటర్‌, ఎనర్జీ, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో సేవలు అందిస్తోంది. ముంబయిలోని ఆర్‌బీఐ భవనం, ది తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ నిర్మించింది పల్లోంజీ గ్రూపే. 1970లో పల్లోంజీ మిస్త్రీ ఈ సంస్థను మధ్యప్రాశ్చ్యంలోని అబుదాబీ, ఖతర్‌, దుబాయ్‌లో విస్తరించారు. 1971లో ఒమన్‌ సుల్తాన్‌ ప్యాలెస్‌ సహా పలు కీలక భవనాలను ఈ సంస్థ నిర్మించింది. పల్లోంజీ మిస్త్రీ నేతృత్వంలో సంస్థ రియల్‌ ఎస్టేట్‌, వాటర్‌, ఎనర్జీ, ఫైనాన్షియల్‌ సేవల రంగాల్లో విస్తరించింది. 2004లో ఆయన కుమారుడు షాపూర్‌ మిస్త్రీకి సంస్థ బాధ్యతలు అప్పజెప్పారు.

1865 స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ కింద మొత్తం 18 కంపెనీలు ఉన్నాయి. 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రూప్‌ 18.4శాతం షేర్లతో టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని