Elon Musk: ‘మస్క్జీ.. ట్విటర్ బదులు శ్రీలంకను కొనొచ్చుగా..!’
ప్రముఖ సోషల్మీడియా సంస్థ ట్విటర్ను కొనుగోలు చేసేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే
ఎలాన్ మస్క్పై స్నాప్డీల్ సీఈఓ జోక్
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ సోషల్మీడియా సంస్థ ట్విటర్ను కొనుగోలు చేసేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే మస్క్ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ సీఈఓ కూడా మస్క్పై జోకులు వేశారు. ట్విటర్కు బదులుగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను కొనొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు.
‘‘ట్విటర్ను కొనుగోలు చేసేందుకు మస్క్ చేసిన ఆఫర్ 43 బిలియన్ డాలర్లు. శ్రీలంక అప్పులు 45 బిలియన్ డాలర్లు. అలాంటప్పుడు మస్క్ ఆ దేశాన్ని కొనొచ్చు. తన పేరును కూడా సిలాన్ మస్క్ అని పెట్టుకోవచ్చు’’ అని స్నాప్డీల్ సీఈఓ కునాల్ బహెల్ ట్విటర్లో రాసుకొచ్చారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. సిలాన్ అనేది శ్రీలంక దేశానికున్న మరో పేరు. కునాల్తో పాలు పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను మస్క్ను కొనుగోలు చేసి ఆ దేశాన్ని రుణభారం నుంచి గట్టెక్కిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ట్విటర్లో వాటాదారుగా ఉన్న మస్క్.. సంస్థలోని మిగిలిన వాటాలనూ కొనుగోలు చేస్తానని ఇటీవల ప్రతిపాదించారు. ఒక్కో ట్విటర్ షేరును 54.20 డాలర్లు చొప్పున కొనుగోలు చేస్తామని, ఇందుకు 43 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.22 లక్షల కోట్లు)కు పైగా చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ను ట్విటర్ బోర్డులోని కొందరు సభ్యులు నిరాకరిస్తున్నారు. అటు సంస్థ కూడా దీనికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ట్విటర్లో 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన మస్క్ అతిపెద్ద వాటాదారుల్లో ఒకరిగా నిలిచారు. బోర్డులో చేరమని కంపెనీ ఆహ్వానించగా.. మస్క్ అందుకు నిరాకరించారు. తాజాగా కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. ట్విటర్లో ఎలాన్ మస్క్కు 8.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.