జనవరి, 2021 నుంచి పెరగనున్న కార్ల ధరలు..

స్కోడా కూడా జనవరి 2021 నుంచి తన అన్ని కారు మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది

Published : 31 Dec 2020 12:08 IST

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు చాలా మంది కారు వినియోగదారులు కొత్త మోడళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే కార్ల తయారీ సంస్థలు కూడా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూనే, ఇప్పటికే విడుదలైన కార్ల ధరలను పెంచుతూ ఉంటారు. 2021 సంవత్సరానికి గాను ఇప్పటికే కొన్ని కార్ల తయారీ సంస్థలు ధరల పెరుగుదలను ప్రకటించారు. ధరల పెరుగుదలను ప్రకటించిన అన్ని కార్ల తయారీదారుల జాబితాను ఒకసారి కింద చూద్దాం. 

మారుతీ సుజుకీ :

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటైన మారుతీ, జనవరి 2021 నుంచి అన్ని కారు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఎంత మొత్తంలో ధరలను పెంచుతున్నారో సంస్థ వెల్లడించనప్పటికీ, ఎంచుకున్న మోడల్‌ ఆధారంగా ఇది మారుతుందని పేర్కొంది. ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా, బాలెనో, వాగన్ ఆర్ వంటి ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో సహా అరేనా, నెక్సా మోడళ్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని సంస్థ తెలిపింది. మారుతీ ప్రస్తుతం రూ. 2.95 లక్షల నుంచి రూ. 12.39 లక్షల వరకు వివిధ ధరలలో కార్లను అందిస్తుంది. 

మహీంద్రా :

పెరుగుతున్న ఇన్పుట్, వస్తువుల వ్యయాల కారణంగా జనవరి 2021 నుంచి ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా తెలిపింది. పెంపు ఎంతవరకు ఉంటుందో స్పష్టంగా  తెలియనప్పటికీ, ఇది అన్ని మహీంద్రా మోడళ్లకు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అయితే, నవంబర్ 30న లేదా అంతకన్నా ముందు కొత్త థార్ ను బుక్ చేసుకున్న కస్టమర్లకు దాని లాంచ్ ధరకే అందించనుంది. మహీంద్రా ప్రస్తుతం రూ. 5.67 లక్షల నుంచి రూ. 31.73 లక్షల వరకు వివిధ ధరలలో కార్లను అందిస్తుంది. 

రెనాల్ట్ :

రెనాల్ట్ తన కారు మోడళ్ల ధరలను జనవరి 2021 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. పైన తెలిపిన కారు బ్రాండ్ల మాదిరిగా కాకుండా వేరియంట్, మోడల్ ఆధారంగా పెరుగుదల రూ. 28,000 వరకు ఉంటుందని రెనాల్ట్ తెలిపింది. రెనాల్ట్ ప్రస్తుతం భారతీయ పోర్ట్‌ఫోలియోలో రూ. 2.99 లక్షల నుంచి రూ. 13.59 లక్షల వరకు వివిధ ధరలలో కార్లను అందిస్తుంది. 

ఎంజీ మోటార్ :

ఎంజీ మోటార్ త్వరలో హెక్టార్ ఎస్‌యూవీ 7 సీటర్ వెర్షన్ లో కొత్త మోడల్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. 2021 మొదట్లోనే ఈ కారును విడుదల చేయనుండగా, ఖర్చులు పెరగడం వలన అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ఎంజీ మోటార్ ప్రకటించింది. ఎంజీ మోటార్ ప్రస్తుతం భారతదేశంలో నాలుగు ఎస్‌యూవీలను రూ. 12.83 లక్షల నుంచి రూ. 35.58 లక్షల వరకు వివిధ ధరలలో కార్లను అందిస్తుంది. 

నిస్సాన్-డాట్సన్ :

జనవరి 2021 నుంచి కొత్త మోడళ్ల ను విడుదల చేయడానికి నిస్సాన్-డాట్సన్ సిద్ధంగా ఉంది. పెరిగిన వ్యయాల కారణంగా కారు మోడళ్ల ధరలను 5 శాతం వరకు పెంచనున్నట్లు నిస్సాన్-డాట్సన్ ప్రకటించింది. ఈ పెంపు ఇటీవల విడుదల చేసిన నిస్సాన్ మాగ్నైట్ కు కూడా వర్తిస్తుందని సంస్థ తెలిపింది. నిస్సాన్, డాట్సన్ రెండూ భారతదేశంలో మూడు మోడళ్లను రూ. 2.83 లక్షల నుంచి రూ. 2.12 కోట్ల వరకు వివిధ ధరలలో కార్లను అందిస్తున్నాయి. 

వోక్స్  వేగన్ : 

జనవరి 2021 లో అమలు చేయబోయే ధరల పెరుగుదల కారణంగా వోక్స్  వేగన్ పోలో, వెంటో ధరలు 2.5 శాతం వరకు పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్పుట్, వస్తువుల వ్యయాల కారణంగా కార్ల ధరలు పెంచడం అవసరమని వోక్స్  వేగన్ తెలిపింది. పోలో ధరను రూ. 5.87 లక్షల నుంచి రూ. 9.67 లక్షల వరకు, అలాగే వెంటో ధరను రూ. 8.93 లక్షల నుంచి రూ. 13.39 లక్షల వరకు పెంచడం జరిగిందని సంస్థ తెలిపింది. 

స్కోడా :

స్కోడా కూడా జనవరి 2021 నుంచి తన అన్ని కారు మోడళ్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్, వస్తువుల వ్యయాలు, మారకపు రేట్లు ధరల పెరుగుదలకు కారణమని సంస్థ పేర్కొంది. స్కోడా ప్రస్తుతం భారతదేశంలో రూ. 7.99 లక్షల నుంచి రూ. 35.99 లక్షల వరకు నాలుగు మోడళ్లను అందిస్తుంది.

హ్యుందాయ్, కియా, హోండాలతో పాటు కొన్ని ప్రముఖ బ్రాండ్ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, వారు కూడా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని