Agriculture: రైతులకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలివే..

కేంద్రం దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలను ఆశించి వ్యవసాయ రంగానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది, వీటిలో ముఖ్యమైన పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 24 Dec 2022 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల్లో ప్రధానమైనవి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC), ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (PMFBY), ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌-ధన్‌ యోజన (PMKMY), ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM KISAN), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) వంటివి ఇందులో ఉన్నాయి. మరి ఈ పథకాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC)

2020లో కేంద్ర ప్రభుత్వం సవరించిన కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు వారి సాగు, ఇతర అవసరాల కోసం ఒకే విండోలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి తగినంత రుణాన్ని సకాలంలో అందిస్తుంది. భూ యజమానులైన రైతులకు, కౌలు రైతులుగా పేర్కొనే వారికి విడిగా, ఉమ్మడిగా కూడా రుణాలను అందిస్తుంది.

ఏ అవసరాలకు రుణం?
ఈ రుణాలను పంటల సాగుకే కాకుండా పంట తర్వాత ఖర్చులు, పంటను మార్కెటింగ్‌ చేసుకోవడానికి, రైతు గృహ వినియోగ అవసరాలు తీర్చుకోవడానికి కూడా అందిస్తుంది. పాడి పశువులు, చేపల పెంపకం, వ్యవసాయ పంపు సెట్లు, స్ప్రేయర్లు మొదలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా రుణాలను ఇస్తుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, సహకార సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

2. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (PMFBY)

ఇది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. 2016లో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఇది నివారించలేని ప్రకృతి నష్టాల నుంచి పంటలను కాపాడ్డానికి ఏర్పాటైంది. విత్తడానికి ముందు, పంట తర్వాత కలిగే నష్టాలకు సమగ్ర పంట బీమా కవరేజీని రైతులకు అందిస్తుంది. ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించి, వినూత్నమైన, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తుంది. రైతులు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫసల్‌ బీమా యోజన స్కీమ్‌కు దేశవ్యాప్తంగా 36 కోట్లకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 ఫిబ్రవరి 4 నాటికి ఈ పథకం కింద ఇప్పటికే విలువ పరంగా రైతులకు రూ.1,07,059 కోట్లకు పైగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ జరిగింది.

3. ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌-ధన్‌ యోజన(PMKMY)

ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఇది చిన్న, సన్నకారు రైతుల కోసం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం. దేశంలోని రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 2019 ఆగస్టు  నాటికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులలో పేర్లు ఉన్న 18-40 సంవత్సరాల వయసు గల, రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకం ప్రకారం ప్రయోజనాలను పొందడానికి అర్హులు. రైతులు వారి వయసును బట్టి నెలకు రూ.55-200 వరకు పెన్షన్‌ ఫండ్‌కు జమ చేయాలి. వారు 60 సంవత్సరాల వయసులో పెన్షన్‌ అర్హత పొందేందుకు కనీసం 20 ఏళ్ల పాటు చందాను అందించాలి. రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీ రూ.3,000 పెన్షన్‌ లభిస్తుంది. 2022 జనవరి, 31 నాటికి మొత్తం 21,86,918 మంది రైతులు ఈ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

4. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(PMKSY)

'హర్‌ ఖేత్‌ కో పానీ' నినాదంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిత నీటిపారుదలతో విస్తరించడానికి, నీటి వృథాను తగ్గించడానికి, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి 10 లక్షల హెక్టార్లకు పైగా భూమి మైక్రో ఇరిగేషన్‌ కింద సాగు చేస్తున్నారు.

5. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM KISAN)

2018లో ప్రారంభమైన ఈ పథకంలో చిన్న, సన్నకారు భూమి కలిగిన రైతు కుటుంబాలకు సాగు సహాయం, వారి ఆర్థిక అవసరాల కోసం రూపొందించారు. ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్రం ప్రతి 4 నెలలకు (3 సమాన వాయిదాల్లో) రూ.2000, అంటే సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతుల కోసం ఏర్పాటైంది. 2019 జూన్‌ 1 నుంచి ఈ స్కీమ్‌ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 2022, ఆగస్టు వరకు దాదాపు 11.37 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.2 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని